పేదలకు అండ.. వైఎస్సార్‌సీపీ జెండా 

13 Mar, 2019 11:59 IST|Sakshi
రంగాపురం, చిన్నకడబూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రదీప్‌రెడ్డి తదితరులు 

సాక్షి, పెద్దకడబూరు: ప్రతి పేదవాడికి అండ కావాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు వై.ప్రదీప్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రంగాపురం, చిన్నకడబూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల కరపత్రాలను పంచి వాటి ప్రాముఖ్యతను మహిళలకు, వృద్ధులకు, రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు.

నవరత్రాలు ప్రతి ఒక్క పేదవానికి ఆర్థికంగా అండగా నిలుస్తాయన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుతున్న సీఎం చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయితే పొదుపు మహిళలు బ్యాంక్‌ల్లో తీసుకున్న రుణాలు చెల్లించనవసరం లేదని,  ఆ మొత్తం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.

ఒకవేళ ఇప్పటికే ఎవరైనా పొదుపు మహిళలు బ్యాంక్‌లో తీసుకున్న రుణాలు చెల్లించి ఉంటే వాటిని కూడా వైఎస్‌ జగన్‌ తిరిగి చెల్లిస్తారన్నారు. ప్రజలందరూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి, వేయించి వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని ప్రదీప్‌రెడ్డి కోరారు. గతంలో తమ పార్టీ అధికారంలో లేనప్పటికీ సొంత నిధులతో నియోజకవర్గంలో తాగునీరు, గ్రావెల్‌ రోడ్లు, బోర్లు తదితర అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఈసారి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలోని ప్రతి చిన్న సమస్యను పరిష్కరిస్తామని ప్రదీప్‌రెడ్డి హామీ ఇచ్చారు.

పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, మండల అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, ఎంపీపీ, వైఎస్‌ఆర్‌ సీపీ పంచాయతీరాజ్‌ రాష్ట్ర కార్యదర్శి రఘురాముడు, జిల్లా టెలికాం అడ్వైజర్‌ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి, బీసీసెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, వైస్‌ ఎంపీపీ నాగేంద్ర, మండల నాయకులు గజేంద్రరెడ్డి, జాము మూకన్న, పూజారి ఈరన్న, పెద్దయ్య, దేవదానం, అర్లప్ప, ఉచ్చప్ప, మొట్రు ఈరన్న తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు