నకిలీ సర్టిఫికెట్ ముఠా గుట్టురట్టు

2 Feb, 2015 08:42 IST|Sakshi

వైఎస్సార్(బద్వేల్): జిల్లాలో ఓ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్టు గుట్టురట్టయింది. పాస్‌పోర్టు కోసం సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సిద్ధుగారిపల్లెకు చెందిన ఓ యువకుడు కువైట్ దేశం వెళదామని పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేద్దామని వెళ్లాడు. ఇతను పదో తరగతి కూడా చదువుకోలేదు. కనీసం పదో తరగతి సర్టిఫికెట్లు ఉంటేనే పాస్‌పోర్ట్ తేలికగా వస్తుందని ఓ ప్రభుత్వ ఉద్యోగి చెప్పడంతో ఆవిధంగా ప్రయత్నాలు ప్రారంభించాడు. రూ.40 వే లు చెల్లిస్తే సర్టిఫికెట్ ఇస్తానని ఓ ప్రభుత్వ టీచర్ చెప్పడంతో సదరు యువకుడు ఆ డబ్బును చెల్లించారు. బద్వేల్‌లోని ప్రవీత్ పబ్లిక్ హైస్కూల్ నుంచి టీసీ, ఇతర సర్టిఫికెట్లు తీసుకుని పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు.

స్పెషల్ బ్రాంచ్ అధికారి శేషగిరిరావు జరిపిన తనిఖీల్లో యువకుడు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని తేలడంతో స్థానిక సీఐ వెంకటప్పకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన సీఐకు అసలు విషయం తెలియడంతో నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న శేఖర్, హరి, ఓ రిటైర్డ్ తహశీల్దార్ సమీప బంధువు, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రక్షించటానికి మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. నిందితుల నుంచి సర్టిఫికెట్లు తయారు చేయడానికి వినియోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పేర్లు పోలీసులు అధికారికంగా తెలపలేదు.

మరిన్ని వార్తలు