హైదరాబాద్‌లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్‌

25 Sep, 2023 11:12 IST|Sakshi

హైదరాబాద్: వైద్యం పేరుతో క్షుద్ర పూజలు చేస్తున్న నకిలీ డాక్టర్‌ను ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌లో అప్పగించారు. సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం సాహెబ్‌ నగర్‌లో నివాసం ఉంటున్న దేవులపల్లి కార్తీక్‌ రాజు ఈ నెల 13న తలనొప్పి, నరాల బాధతో ఎల్‌బీనగర్‌లోని సిరీస్‌ రోడ్‌లోని సిరినగర్‌ కాలనీలో ఉన్న జీఎన్‌ఆర్‌ ఆయుర్వేదిక్‌ సెంటర్‌కు వచ్చాడు.

అక్కడ జ్ఞానేశ్వర్‌ అనే నకిలీ డాక్టర్‌ కార్తీక్‌రాజును పరీక్షించి మందులు ఇవ్వకుండా...నీకు చేతబడి చేశారని, పూజలు చేయాలంటూ సలహా ఇచ్చాడు. 22వ తేదీన అమావాస్య నాడు పూజలు జరిపిస్తానని చెప్పి రూ.50 వేలు వసూలు చేశాడు.

ఇతని తీరుపై అనుమానం వచ్చిన బాధితుడు ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు ఆదివారం జీఎన్‌ఆర్‌ ఆయుర్వేదిక్‌ హస్పిటల్‌పై దాడి చేసి జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని..అతని వద్ద నుంచి క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు