సాక్షి ఎఫెక్ట్‌: కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం

19 Feb, 2019 12:35 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు కొండవీడు పర్యటన ఓ రైతు కుటుంబంలో విషాదం నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామ రైతు కోటయ్యకు చెందిన కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను పోలీసులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా కోటయ్యను తన పొలంలోకి రానివ్వకుండా అవమానించారు. ఆ తర్వాత కాసేపటికే కోటయ్య అనుమానస్పద రీతిలో మృతి చెందారు. రైతు మృతిని అధికార యంత్రాగం తేలికగా తీసుకుంది. కోటయ్య మృతిపై సాక్షి మీడియా కథనాలు ప్రచురించడంతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. కోటయ్య మృతి చెందిన 20 గంటల తర్వాత పోలీసులు స్పందించారు. అందులో భాగంగా పుట్టకోట చేరుకున్న సీఐ విజయచంద్ర, యడ్లపాడు ఎస్‌ఐ శ్రీనివాస్‌ కోటయ్య మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.(సీఎం సభ కోసం రైతును చంపేశారు)

కాగా, పోలీసులు కొట్టడం వల్లే కోటయ్య చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని వేడుకున్నా సీఎం వస్తున్నారంటూ పోలీసులు అందుకు అంగీకరించలేదని  మృతుడి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రైతు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని పార్టీ నాయకులతో కలిసి సీఎం రాకముందే కొత్తపాలెం గ్రామానికి చేరుకున్నారు. అయితే ఆమెను, పార్టీ నాయకులను మృతుడి ఇంటివద్దకు వెళ్లకుండా గ్రామ శివారులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం వెళ్లిపోయిన అనంతరం పోలీసులు రజనిని అనుమతించటంతో  రాత్రి కొత్తపాలెం చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

బీసీ వర్గాల ఆందోళన..
బీసీ రైతు కోటయ్య మృతిపై బీసీ వర్గాలు ఆందోళన చేపట్టాయి. బీసీ ఓటర్లు తమ వెంటే ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు.. ఓ బీసీ రైతు చనిపోతే ఎందుకు పట్టించుకోరని ప్రశ్నిస్తున్నారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఇదేనా అని పుట్టకోట రైతులు నిలదీశారు. కోటయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అతని కుటుంబానికి 20లక్షల రూపాయల పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు