కన్న కూతుర్ని చెట్టుకు వేలాడదీశాడు

20 Mar, 2017 09:13 IST|Sakshi
కన్న కూతుర్ని చెట్టుకు వేలాడదీశాడు

కట్లు విప్పితే అందరికీ ఇదే గతి అని భార్యతో పాటు బంధువులకు హెచ్చరిక

పోడూరు: మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్నకూతుర్ని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి దారుణంగా హింసించాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరులో శనివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నల్లపూసల శ్రీను, వెంకటలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. మద్యానికి బానిసైన శ్రీను రోజూ పీకలదాకా తాగి వచ్చి పిల్లలను క్రూరంగా హింసించేవాడు. ఈక్రమంలో శనివారం ఉదయం 8 గంటలకు ఎవరిదో చేను తొక్కేసి పాడుచేసిందంటూ రెండో కుమార్తె మేరీ(9)ని విపరీతంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా కాళ్లూ, చేతులు తాళ్లతో కట్టేసి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు తలకిందులుగా వేలాడదీశాడు.

కట్లువిప్పితే ఇలాగే వేలాడదీస్తానని భార్యతో పాటు అక్కడే ఉన్న బంధువులను హెచ్చరించాడు. దీంతో ఆ బాలిక ఏడుస్తున్నా కూడా కట్లు విప్పడానికి ఎవరూ సాహసించలేదు. ఈ విషయం తెలుసుకున్న వార్డు మెంబర్‌ చవ్వాకుల ప్రభావతి మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు వచ్చి మేరీని విడిపించారు. సమాచారం అందుకున్న ఎస్సై పి.రవీంద్రబాబు కూడా సంఘటనా స్థలికి వచ్చి బాధితురాలని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలిక చేతిపై వాతలు పెట్టిన గాయాలతో పాటు పెద్దపెద్ద బొబ్బలు ఉన్నాయి. దీంతో వెంటనే బాలికను పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.