పెళ్లైన మూడు రోజులకే దారుణం.. సొంత తండ్రే కిరాతకం 

3 Nov, 2023 16:34 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో  ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కోటి కలలతో ఏడు అడుగులు వేసిన జంటను   నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది.  ఈ సందర్భంగా గతంలో జరిగిన అనేక పరువు హత్యలను గుర్తుకు తెచ్చింది. తమకంటే పేదవాడైన  అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో నవదంపతులను సొంత తండ్రే హత్య చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో గురువారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.

పోలీసుల సమాచారం ప్రకారం..కోవిల్‌పట్టికి చెందిన మరిసెల్వం (24), ఎం కార్తీక (20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇంటినుంచి పారిపోయారు. రక్షణ కోరుతూ కోవిల్‌పట్టి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌ అధికారులను ఆశ్రయించారు. ఆ తర్వాత అదే రోజు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెళ్లి చేసుకుని బుధవారం వరకు కోవిల్‌పట్టిలో ఉన్నారు. సంచలనం సృష్టించింది.

ఇదిలావుండగా, వీరి పెళ్లి ముందు ఇరు కుటుంబాలు వ్యతిరేకించినప్పటికీ పెళ్లి తరువాత, సెల్వం కుటుంబం కొత్త జంటను ఆదరించింది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా సెల్వం తన భార్య కార్తీకతో కలిసి జిల్లాలోని మురుగేషన్ నగర్ ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నాడు. దీంతో అదను కోసం వేచి చూస్తున్న  దుండగులు  పథకాన్ని  పక్కాగా అమలు చేశారు. మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురు గుర్తుతెలియని ముఠా మారణాయుధాలతో  ఇంట్లోకి చొరబడి నవ దంపతులపై దాడి చేసి హత్య గావించింది  ఆ తరువాత అక్కడినుంచి అక్కడి నుండి పారిపోయింది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని తూత్తుకుడి ఎస్పీ ఎల్ బాలాజీ శరవణన్ తెలిపారు. అలాగే అమ్మాయి తండ్రి ముత్తు రామలింగం కిరాయి  హంతకులతో వారిద్దరినీ హత్య చేయించినట్టు తమ ప్రాథమిక  దర్యాప్తులో తేలిందన్నారు. మూడు ప్రత్యేక బలగాలతో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 

మరిన్ని వార్తలు