ఏపీలో మధ్యాహ్నం 2గంటలకు తొలి ఫలితం!

22 May, 2019 17:02 IST|Sakshi

అర్థరాత్రికి మొత్తం తుది ఫలితాలు వెల్లడి..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్‌ ఏర్పాట్లపై ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ ట్రెండ్‌ తెలిసిపోతుందని, రేపు అర్థరాత్రికి మొత‍్తం ఫలితాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీ ప్యాట్లు లెక్కిస్తామని, కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్‌ తర్వాత రీ పోలింగ్‌ జరిగే అవకాశం చాలా తక్కువ అని ద్వివేది అభిప్రాయపడ్డారు.

కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, పాదర్శకంగా ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుందని ద్వివేది తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌, సర్వీస్‌ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. 36 కేంద్రాల్లో 350 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశామని, అసెంబ్లీ, లోక్‌సభకు వేర్వేరుగా పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. అలాగే అసెంబ్లీ, లోక్‌సభకు వేర్వేరుగా లాటరీలు తీసి వీవీ ప్యాట్లు లెక్కిస్తామన్నారు. ఫలితాలను సరిచూసుకోవడానికి వీవీ ప్యాట్ల స్లిప్పులు ఉపయోగించనున్నట్లు ద్వివేది తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, 100 మీటర్ల దూరం నుంచి వాహనాలకు అనుమతి లేదని, సుమారు 25వేలమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సువిధ యాప్,ఈసీఐ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చని ద్వివేది తెలిపారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

>
మరిన్ని వార్తలు