సాక్షి, విశాఖపట్నం: ‘‘మళ్లీ మా ఓట్ల కోసమేనా ఇదంతా?’’.. హైదరాబాద్లోని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లడంపై కాపులు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో 2014 ఎన్నికల సమయంలో పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లాడని, మళ్లీ అదే తరహాలో పవన్ చంద్రబాబు భేటీ అయ్యాడని గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ మోసం చేయడానికే ఈ ఇద్దరూ కలుస్తున్నారని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో తన అవసరం తీరిన తర్వాత చంద్రబాబు.. తమను ఎలా చిత్రహింసలు పెట్టింది కాపులు ఇంకా మరిచిపోలేదంట. కేసులతో వేధించిన సంగతిని గుర్తు చేస్తున్నారు వాళ్లు. ఇందుకు ముద్రగడ పద్మనాభం కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఉదాహరించారు.
"ముద్రగడను చిత్రహింసలు పెట్టిన సంగతి ఇంకా మా కళ్ల ముందు మెదులాడుతోంది. ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులతో దాడి చేయించారు. కాపు ఉద్యమ సమయంలో యువతపై తప్పుడు కేసులు బనాయించారు. అవన్నీ అంతా సులభంగా మరిచిపోం. తుని రైల్వే దహన సమయంలో.. పనికట్టుకుని వేధింపులకు గురిచేసిన ఘటననూ మర్చిపోలేం. మళ్లీ అధికారం కోసమే కదా ఈ కలయికలు".. అని పవన్-చంద్రబాబు భేటీపై మండిపడ్డారు.
"నాడు చంద్రబాబు జరిపిన ఆకృత్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతున్నాయి. అధికారం కోసం ఇంకా ఈ ఇద్దరు మోసం చేస్తారు?.. ఎన్నికల సమయంలోనే కాపులు గుర్తొస్తారా? అంటూ కాపులు ప్రశ్నిస్తున్నారు. తోటి కాపు సోదరులపై దాడులు జరుగుతుంటే పవన్ ఎందుకు నోరు మెదపలేదంటూ నిలదీస్తున్నారు. అధికారంలో ఉన్న రోజులు చంద్రబాబు కాపు ప్రజాప్రతినిధులను తన గుమ్మం ఎక్కనివ్వలేదని.. ఆయన తనయుడు లోకేష్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదని" గుర్తు చేసుకుంటూ మళ్లీ మోసపోమని ఘంటా పథంగా చెబుతున్నారు.
చదవండి: పవన్ ఇంటికి చంద్రబాబు