హోటళ్లపై ఫుడ్ కంట్రోలర్ దాడులు

30 Jul, 2015 16:19 IST|Sakshi

గుంటూరు : ఆహార పదార్థాల తయారీ, అమ్మకంలో కనీస శుభ్రతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై జిల్లా ఫుడ్ కంట్రోలర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో శుభ్రత ప్రమాణాలు పాటించని రెండు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్న అధికారులు పలు హోటళ్లలో ఆహార పదార్ధాలను నిల్వ ఉంచడంతో పాటు, అయోడిన్ లేని ఉప్పును వాడుతుండటాన్ని గుర్తించారు.

15 రోజుల్లోగా తీరు మార్చుకోవాలని, తిరిగి తనిఖీ చేయడానికి వచ్చేసరికి పరిస్థితిలో మార్పు రాకపోతే హోటళ్లను సీజ్ చేస్తామని జిల్లా ఫుడ్ కంట్రోలర్ పూర్ణ చంద్రారావు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా ఫుడ్ కంట్రోలర్ దాడులు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న పలు హోటళ్ల యజమానులు తమ హోటళ్లను తెరవలేదు.

మరిన్ని వార్తలు