కొరియోగ్రఫీ అవకాశం రావడం అదృష్టం

3 Dec, 2014 01:54 IST|Sakshi

శ్రీకాకుళం కల్చరల్ : పట్టణానికి చెందిన అభినయ నృత్యకళానికేతన్ నృత్య దర్శకురాలు తిమ్మరాజు నీరజసుబ్రహ్మణ్యంకు కొరియోగ్రఫీగా అవకాశం వచ్చింది. ఈమె కొరియోగ్రఫీ చేసిన చిత్రం ఆడేపాడే తోల్బోమ్మ ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా గత నెల 30వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా విడుదల చేశారు. మెహెర్ బాబా ఆర్ట్‌క్రియేషన్స్ బ్యానర్‌పై మహిళలు మాత్రమే నటించిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం ‘ఆడేపాడే తోల్బోమ్మ’కు కొరియోగ్రఫీగా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని నీరజసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ చిత్రంలో 5 పాటలు ఉన్నాయని, వాటిలో టైటిల్ సాంగుకు తప్ప మిగిలిన పాటలకు కొరియోగ్రఫీ చేశానని తెలిపారు. శ్రీకాకుళం నుంచి మొట్ట మొదటిగా కొరియోగ్రఫీ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాన్నారు. పట్టణానికి చెందిన విద్యార్థినులు కె.సింధూశ్రీహర్షిత, జి.రామలక్ష్మిలు నృత్యాలు చేశారన్నారు. అలాగే ఎంబీ క్రియేషన్స్ వారి తదుపరి చిత్రానికి, జేజే ఆర్ట్స్ చెన్నై బ్యానర్‌పై నిర్మించబోతున్న తదుపరి చిత్రానికి కొరియోగ్రఫీ చేయబోతున్నట్టు ఆమె తెలిపారు.
 

మరిన్ని వార్తలు