నెల్లూరులో కాల్పుల కలకలం

4 Nov, 2018 07:52 IST|Sakshi

నెల్లూరు(క్రైమ్‌): దుండగుల కాల్పులతో బొల్లినేని ఆస్పత్రిలో మృతిచెందిన మహేంద్రసింగ్‌ మృతదేహాన్ని, సంఘటన స్థలిని శనివారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పరిశీలించారు.  సంఘటన జరిగిన తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మృతునికి వ్యాపార లావాదేవీల్లో లేదా వ్యక్తిగతంగా ఎవరితోనైనా విభేదాలున్నాయా అనే వివరాల గురించి ఆరా తీశారు. కుటుంబ సభ్యులను విచారించగా ఎవరితోనూ విభేదాలులేవని వారు వెల్లడించినట్లు సమాచారం. అయితే దుండగులు ఎందుకు హత్యచేయాల్సి వచ్చిందనే విషయం పోలీసులకు చిక్కు ప్రశ్నలామారింది. 

ముమ్మరంగా తనిఖీలు
వ్యాపారిపై దుండగులు కాల్పులకు తెగబడిన నేపథ్యం యంత్రాంగం అప్రమత్తమైంది. నగర డీఎస్పీ మురళీకృష్ణతోపాటు నెల్లూరు రూరల్, సీసీఎస్, ట్రాఫిక్‌ డీఎస్పీలు రాఘవరెడ్డి,బాల సుందరరావు, మల్లికార్జున నగరంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేంద్రసింగ్‌ శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. చిన్నబజారు పోలీసులు హత్యఘటనపై కేసు నమోదు చేశారు. వరుస సంఘటనల నేపథ్యంలో సిబ్బంది పనితీరుపై ఎస్పీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

తెలిసినవారి పనే..
మహేంద్రసింగ్‌పై కాల్పులు జరిపిన వారు తెలిసివారే అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండు నుంచి వచ్చిన దుండగులు తొలుత మహేంద్రసింగ్‌తో మాట్లాడుతూ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. మహేంద్రసింగ్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేప«థ్యంలో మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు