ఎన్నో దెబ్బలు తిన్నా.. ఇది ఓ లెక్కా: బాలకృష్ణ

5 Mar, 2018 10:43 IST|Sakshi

సాక్షి, అమరావతి : మార్చి 29న ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తామని హిందూపూర్‌ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనడానికి అమరావతి వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ రామకృష్ణ సినీ స్టూడియోలో తొలిషెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామన్నారు. నందమూరి తారక రామారావు వాస్తవ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇదని, ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదన్నారు. సినిమా షూటింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్‌ మీద ఉన్న అభిమానంతో చాలా మంది చాలా పేర్లు సూచించారని, కానీ ఎన్టీఆర్‌ను మించిన పేరు లేదని భావించి ఆపేరునే ఖరారు చేశామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్‌కు అభిమానులున్నారని, ప్రతిఒక్కరు అభినందించిన వారేనని అన్నారు. ఇటీవలే శష్త్ర చికిత్స చేసుకున్న బాలకృష్ణ, కట్టుతోనే అసెంబ్లీకి వచ్చారు. ఈసందర్భంగా ఆయన్ను పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. జీవితంలో తగిలిన ఎన్నో దెబ్బలతో పోలిస్తే ఇది పెద్ద దెబ్బేమీ కాదని బాలయ్య వారికి సమాధానం ఇచ్చారు. మార్చి31 నుంచి ఏప్రిల్‌ 1 వరకూ లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. హంద్రీనీవా సుజల స్రవంతికి జలహారతి నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు