నాలుగు రోజుల్లో 8243 మందికి పైగా ఫోన్కాల్స్
4732 మందికి వైద్యసేవలు అందించిన డాక్టర్లు
14410కు రోజు రోజుకూ పెరుగుతున్న స్పందన
సాక్షి, అమరావతి: లాక్డౌన్, ప్రజా రవాణా స్తంభించిన నేపథ్యంలో ప్రజలకు ఫోన్ ద్వారానే వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ విధానానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నెంబర్ 14410కు గడిచిన నాలుగు రోజుల్లో 8,243 మంది ఫోన్ చేశారు. వీరిలో 4,732 మందికి వైద్యులు ఫోన్లోనే తగిన సూచనలు, అవసరమైన మందుల సమాచారం ఇచ్చారు. మరో 3491 మందికి వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ ప్రతినిధులు తిరిగి కాల్ చేయగా వారు స్పందించలేదు. 14410 నెంబర్కు ఫోన్ చేస్తే డాక్టర్లు ఫోన్ ద్వారానే సలహాలు ఇవ్వడంతో పాటు అవసరమైన మందుల వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్కు సమాచారమిస్తున్నారు. అక్కడ్నుంచి మందులు పేషెంటు ఇంటికే సరఫరా చేస్తారు.
ఇలా చెయ్యండి..
► ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 14410కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది.
► ఆ తర్వాత కాల్సెంటర్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ తిరిగి మనకు కాల్ చేస్తారు.
► మన వివరాలు నమోదు చేసుకుని సమస్యను తెలుసుకుని సంబంధిత డాక్టరుకు కనెక్ట్ చేస్తారు.
► డాక్టరు మన సమస్యలు విన్నాక మందులు అవసరమనుకుంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు సూచిస్తారు.
► ఆ తర్వాత పేషెంటు ఇంటికే మందులు తీసుకొచ్చి ఇస్తారు.
► మనం మిస్డ్ కాల్ ఇవ్వగానే తిరిగి ఎగ్జిక్యూటివ్ చేస్తారు..కాల్ బిజీ వచ్చినా, స్విచ్ఆఫ్ వచ్చినా రెండోసారి చేస్తారు.
► రెండోసారి ఫోన్ చేసినా సమాధానం ఇవ్వక పోతే మళ్లీ కాల్ రాదు. మళ్లీ కొత్తగా మిస్డ్ కాల్ ఇవ్వాలి.
► ప్రస్తుతం టెలీ మెడిసిన్ కోసం వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్యులు 286 మంది వాలంటరీగా వచ్చి రిజిస్టర్ చేసుకుని పనిచేస్తున్నారు.