న్యాయవాదులకు అండగా జగన్‌

20 Mar, 2019 11:20 IST|Sakshi
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజాంలో కలిసిన న్యాయవాదులు (ఫైల్‌) 

సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్‌: నాయవాదులు సమాజంలో ఒక భాగం. సామాన్యుడి నుంచి ధనంవంతుడి వరకు అందరికీ న్యాయం కావాలంటే న్యాయవాది ద్వారానే కోర్టులో వాదన వినిపించుకోవాలి. న్యాయవాదికి ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆర్ధిక చేయూత ఉండదు. క్లయింట్లు ఇచ్చే కనీన నగదుతో కావాల్సిన మౌలిక సౌకర్యాలతో పాటు కుంటుంబ పోషణ  సమకూర్చుకోవాలి. అయితే ఆ ఆదాయం కూడా స్థిరం కాదు.  మేధావి వర్గానికి చెందిన న్యాయవాదులలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేధావులకు సాయం చేయలేని ప్రభుత్వాలు సామాన్యులను ఎలా గుర్తిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. వారికి ఇతర వృత్తుల వారిలా సామాజిక భద్రత, సంక్షేమాల అవసరం ఉంది.

వారి ఆర్థిక ఇబ్బందులను నల్లకోటుతో కప్పుకుని సగటు మనిషికి న్యాయం కోసం పోరాడుతున్న వృత్తి వారిది. దీనిలో కొత్తగా న్యాయవాద వృత్తికి వచ్చిన వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది. వారికి వృత్తి పట్ల ధైర్యాన్ని, సహాయన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇతర వర్గాల వలే న్యాయవాదులకు కూడా సముచిత స్థానం కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులు పలుమార్లు ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. వారి న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టారు. అంతే కాదు న్యాయవాదులకు అన్ని విధాలా తోడుగా ఉంటున్న గుమస్తాలకు కూడా పలు సమస్యలు ఉన్నాయి. వారు కూడా ఇటీవల ఉద్యమ బాట పట్టారు. న్యాయవాదులకు సంబంధించిన సంఘాలు ఇటీవల ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జిల్లాలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో కలిశారు. వారి ద్వారా న్యాయవాదుల కష్టాలు, సమస్యలు, పరిష్కార మార్గాలను జగన్‌మోహన్‌ రెడ్డి తెలుసుకున్నారు.

అనంతరం వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా జూనియర్‌ న్యాయవాదులకు మూడేళ్ల పాటు నెలకు రూ.5,000 వంతున ప్రోత్సాహం అందజేస్తామని ప్రకటించారు. న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు, స్థలాలు మంజూరుకు కృషి చేస్తామని, వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని జగన్‌మోహన్‌ రెడ్డి ధైర్యం చెప్పారు. అలాగే నోటరీ అడ్వకేట్ల  సమస్యలు, రెన్యువల్‌ విషయంలోనూ, ప్లీడర్‌ గుమస్తాలకు కూడా తగు న్యాయం చేస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. దీంతో న్యాయవాదులకు ధైర్యం వచ్చింది. గతంలో ఏ  నాయకుడూ ఇవ్వని భరోసాను జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చారంటూ న్యాయవాదులంతా సంతోషంలో ఉన్నారు.

న్యాయవాదుల ప్రధాన డిమాండ్లు ఇవే..

∙న్యాయవాదుల సంక్షేమ నిధిని రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. 
∙న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. 
∙ఇల్లు నిర్మించుకునేందకు పథకాలు, రుణాలు మంజూరు చేయాలి. 
∙బార్‌ కౌన్సిల్‌ అఫ్‌ అంధ్రప్రదేశ్‌కు మ్యాచింగ్‌ గ్రాంటును మంజూరు చేయాలి. 
∙జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు స్టెపెండ్‌ ఇవ్వాలి.
∙జూనియర్‌ న్యాయవాదులకు ఈ లైబ్రరీ, లైబ్రరీ సదుపాయాలు కల్పించాలి.  
∙ఉత్తరాంధ్రకు హై కోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలి. 
∙న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు కలించాలి.
∙కేసులకు తగిన విధంగా కోర్టుల సంఖ్యను పెంచాలి. 
∙సత్వర న్యాయం కోసం న్యాయమూర్తుల నియామకాలు పెంచాలి. 
∙అడ్వకేట్‌ ఆకాడమీ ఏర్పాటు చేయాలి. 
∙న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయాలి.
∙న్యాయవాదులకు పింఛను సదుపాయం కల్పించాలి.
∙న్యాయవాద గుమస్తాకు రూ.4 లక్షలు సంక్షేమ ఫండ్, ఆరోగ్య బీమా వర్తింప చేయాలి.

 జగన్‌ నిర్ణయం హర్షణీయం 
న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించడం చాలా హర్షణీయం. గతంలో ఏ నాయకుడూ  న్యాయవాదుల సంక్షేమంపై ఇలా భరోసా ఇవ్వలేదు. జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు స్టైపెండ్‌ ఇస్తామని జగన్‌ ప్రకటించారు. దీనిని సక్రమంగా అమలు చేస్తే, చాలామంది న్యాయవాద వృత్తిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. 
–పొన్నాడ వెంకటరమణ, జిల్లా బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, శ్రీకాకుళం.


న్యాయవాదుల ఉన్నతికి ఊతం
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు వారి ఉన్నతికి ఊతమిస్తాయి. న్యాయవాదుల్లో  ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆసరాగా దొరుకుతుంది. అదేవిధంగా సత్వర న్యాయం కోసం కోర్టుల సంఖ్య, న్యాయమూర్తుల నియామకాలు కూడా చేపట్టాలి, దీంతో సామాన్యుడికి సత్వర న్యాయం అందుతుంది.  
 –కూన అన్నం నాయుడు, జిల్లా బార్‌ అసోసియేషన్‌ మాజీ ఉపాధ్యక్షుడు, శ్రీకాకుళం


ఇళ్ల స్థలాలు ఇస్తామనడం సంతోషం
న్యాయవాదులు సమాజంలో ఉన్న వారే. అంతేకాకుండా మేధావి వర్గానికి చెందిన వారు. అయినంత మాత్రాన తగినంత ఆర్థిక స్థోమత వారిలో చాలామందికి ఉండదు. ఇల్లు కట్టుకోవడం కష్టమే. అటువంటి వారికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి  ఇళ్ల స్థలాలు, అవసరమైతే రుణాలు ఇప్పిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. 
–కె జీవరత్నం, మాజీ అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, శ్రీకాకుళం.

జిల్లాలో న్యాయవాదులు                        6, 500
జూనియర్‌ లాయర్లు                              2,500
జిల్లా కోర్టులో న్యాయవాద గుమస్తాలు       84
జిల్లా వ్యాప్తంగా న్యాయవాద గుమస్తాలు    160

మరిన్ని వార్తలు