ఆ రైతే ఉచిత విద్యుత్‌కు ప్రేరణ

30 Aug, 2018 06:45 IST|Sakshi

జగన్‌ను కలిసి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన బెల్లం రైతు

సాక్షి, విశాఖపట్నం:  మహానేత వైఎస్సార్‌ చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా 2003 ఫిబ్రవరి 15న మునగపాక గ్రామానికి వచ్చారు.  బెల్లం క్రషర్‌ దగ్గరకు వెళ్లి రైతు ఆడారి పోలయ్యతో కలిసి గానుగ తిప్పారు. ఏం పోలయ్య ఎలా ఉన్నావ్‌...చెరకు సాగు ఎలా ఉంది? బెల్లం గిట్టు బాటవుతుందా? అని మహానేత ఆరా తీశారు. రైతుల బతుకలే బాగులోదయ్యా అని బదులివ్వగానే రైతు బాగుపడాలంటే ఏం చేయాలో చెప్పు.. మహానేత అడగ్గానే విడతల వారీగా తెల్లవారుజామున రెండుగంటలు, మధ్యాహ్నం రెండు గంటలు, రాత్రి నాలుగు గంటలు కరెంట్‌ ఇస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం.

 పగటి పూటే ఏడుగంటలు కరెంట్‌ ఇస్తే బాగుంటందయ్యా అని కోరాడు. ఓకే మనం రాగానే ఉదయం పూటే కరెంట్‌ ఇద్దాం..ఇంకేం కావాలోచెప్పు అనగానే ఆ కరెంట్‌ కాస్త ఉచితంగా ఇస్తే రైతు బాగు పడతాడని  బదులిచ్చాడు. మనం అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తా అని హామీ ఇవ్వడమే కాదు..అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్‌ ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. నాటి మహానేతతో తన అనుభవాలను పాదయాత్రలో బుధవారం తమ గ్రామానికి వచ్చిన రాజన్న బిడ్డ  జగన్‌ని కలిసి పోలయ్య కుటుంబం పంచుకుంది. వైఎస్‌ మాదిరిగానే మీరు  కూడా రైతుకు మేలు చేయాలని కోరింది.

మరిన్ని వార్తలు