టీడీపీ డేరా బాబాలను తరిమికొట్టండి

10 Sep, 2017 03:43 IST|Sakshi
టీడీపీ డేరా బాబాలను తరిమికొట్టండి
వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ధ్వజం
ఏం సాధించారని ఇంటింటికీ బయల్దేరుతున్నారు బాబూ?
కర్ణాటకలో ఏపీ యువతపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చిన ఘనత దివంగత వైఎస్‌దే
విజయవాడ: మూడున్నరేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక ప్రతి ఒక్కరినీ మోసం చేసిన టీడీపీ డేరా బాబాలు, వారి గురువులు ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. శనివారమిక్కడ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల మాట్లాడారు. ఏం సాధించారని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారని నిలదీశారు. ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి మోసం చేసిన టీడీపీ డేరా బాబాలను ఏం చేయాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రతిపక్షంగా వైఎస్సార్‌ సీపీ గడపగడపకూ కార్యక్రమం చేపడితే ప్రజలంతా ఆదరించారని గుర్తు చేశారు. ఓట్ల కోసం వాగ్దానాలు ఇచ్చి మాటతప్పిన టీడీపీ డేరాబాబాలను జనం తరిమికొడతారని హెచ్చరించారు. 
 
యువత క్రికెట్‌ బ్యాట్‌లతో బుద్ధి చెబుతారు..
రైతు రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన టీడీపీ బాబాలను రైతులు తరిమికొట్టాలన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తూ మరీ చెప్పిన చంద్రబాబు ఇప్పటిదాకా డ్వాక్రా అక్కచెల్లెళ్ల రుణాలను మాఫీ చేయలేదని ధ్వజమెత్తారు.. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన టీడీపీ నేతలు ఇంటింటికి వెళితే యువత క్రికెట్‌ బ్యాట్‌లతో బుద్ధి చెబుతారన్నారు. నిరుద్యోగభృతి పేరుతో మోసం చేసి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.80 వేల చొప్పున బకాయి ఉందన్నారు.  
 
175 నియోజక వర్గాలు మీవే అయితే ప్రచారమెందుకో...?
దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీ నాయకులకు బదులుగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని జోగి రమేష్‌ గుర్తు చేశారు. ఉచిత విద్యుత్, తెల్ల రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఇళ్ల స్థలాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పక్కా ఇళ్లు, 108 సేవలు అందరికీ అందాయన్నారు. టీడీపీ నేతలు 175 నియోజకవర్గాలు తమవే అని ఒకవైపు చెప్పుకుంటూ మరోవైపు ఇంటింటికీ ఎందుకు బయల్దేరానని నిలదీశారు. ఉద్యోగాల కోసం కర్ణాటకకు వెళ్లిన ఏపీ నిరుద్యోగుల దరఖాస్తులు చించేస్తుంటే ఎన్‌డీఏ సర్కారులో భాగస్వామిగా కొనసాగుతున్న చంద్రబాబుకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. తుంగభద్ర, ఆల్మటి నుంచి నీళ్లు అడిగేందుకు నోరు ఎందుకు పెగలడం లేదని బాబుపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజనలో సోనియాగాంధీ ఎదుట సాగిలపడ్డారని చంద్రబాబును విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్‌ టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాదు శివరామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం.శివారెడ్డి, సీటీ బీసీ సెల్‌ అధ్యక్షుడు బోను రాజేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు