'భుజాలు తడుముకున్న చంద్రబాబు'

22 Aug, 2017 19:11 IST|Sakshi
'భుజాలు తడుముకున్న చంద్రబాబు'

కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): ఆర్య వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వైఎస్‌ జగన్ ప్రకటించగానే సీఎం చంద్రబాబు భుజాలు తడుముకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులను చిన్న చూపు చూసింది చంద్రబాబేనని విమర్శించారు.

నంద్యాలలో అభివృద్ధి పేరుతో వ్యాపారుల షాపులను అంత్యంత దయనీయంగా ధ్వంసం చేశారని.. కాకినాడలో కూడా 45 దుఖాణాలు ధ్వంసం చేసి కేవలం 24 షాపులకు టీడీఎస్ ప్రకటించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మూడున్నర ఏళ్లుగా కాకినాడకు ఏమీ చేయలేని చంద్రబాబు.. రానున్న ఏడాదిన్నరలో ఏమి చేస్తారో ఓటర్లు ఆలోచించాలన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలు ధనబలానికి, ప్రజా బలానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు.

బాబు పతనం కాకినాడ నుంచే ప్రారంభం
టీడీపీ, చంద్రబాబు నాయుడు పతనం కాకినాడ నుంచే ప్రారంభమవుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజలందరూ వైఎస్‌ జగన్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో మంత్రులు, ఎమ్మెల్యేలు కాకినాడలో తిష్ట వేశారని చెప్పారు. సీఎం రెండు రోజులు కాకినాడలో ఉండటానికి వస్తున్నారంటే టీడీపీ ఎంత అభద్రతాభావంతో ఉందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.