అధికార పార్టీ..అడ్డ‘దారి'

23 Apr, 2018 06:49 IST|Sakshi
కర్నూలులో కేసీ కెనాల్‌పై వంతెన నిర్మించే ప్రదేశం ఇదే

రూ.1.25 కోట్ల పనులకు టెండర్‌! 

చక్రం తిప్పుతున్న టీడీపీ ఎమ్మెల్యే  

కర్నూలులో కొనసాగుతున్న కాజ్‌వే పనులు 

జిల్లాలో ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నా.. టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి దక్కించుకుంటున్నారు. ఈ కోవలోనే కర్నూలు నగరంలో జరుగుతున్న పనులకు టెండర్‌ పెట్టారు. ఏకంగా రూ.1.25 కోట్ల పనులను సబ్‌లీజ్‌తో చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇంజినీరింగ్‌ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుండడంచర్చనీయాంశమైంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి పనులకు ప్రతిపాదనలు అడగకపోవడం వివక్షకు తావిస్తోంది.

ఎన్నికల కోసమే... 
ప్రతి నియోజకవర్గం నుంచి రహదారులు, భవనాల శాఖకు వందలాది పనుల కోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు సైతం దెబ్బతిని ఉండడంతో మరమ్మతులు, నూతన రహదారులు, అవసరమైన కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వీటిలో అనుమతి లభించిన పనులు మాత్రం స్వల్పంగా ఉన్నాయని చెప్పవచ్చు. కొందరు ఎమ్మెల్యేలు పనులకు అనుమతి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా ఆశించిన ఫలితం లభించకపోవడంతో ప్రజలకు ముఖం చాటేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని కొందరు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది.

ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండడంతో కొన్ని పనులైనా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కోదానిలో రూ.15 కోట్ల పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనుల వివరాల ప్రతిపాదలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించి రూ.120 కోట్ల పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదనలు తీసుకోవడం మంజూరయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు.  
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష... 
కర్నూలు జిల్లాలో మొత్తం 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. అయితే ఐదుగురు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడంతో అధికార పార్టీలో 8 మంది, ప్రతిపక్ష పార్టీలో ఆరుగురు ఉన్నారు. ఇందులో 8 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో రహదారులు, ఇతర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకుంది. అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఉన్న ఆరు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోలేదని తెలుస్తోంది.

తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఇది తమపై వివక్ష చూపడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు తీరుపై తీవ్ర ఆక్షేపణలు గుప్పిస్తున్నారు. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష 
టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతోంది. ఇది మొదటి నుంచి జరుగుతోంది. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట ఇన్‌చార్జ్‌ల పేరుతో పనులు చేయించారు. ఇప్పుడు కేవలం టీడీపీ వారికే పనులు మంజూరు చేస్తున్నారు. మావి నియోజకవర్గాలు కాదా?..మా దగ్గర ఉన్నది ప్రజలు కాదా? వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు.

మరిన్ని వార్తలు