నమ్మితే నట్టేట ముంచారు

6 Sep, 2019 08:51 IST|Sakshi
రూరల్‌ డీఎస్పీకి ఫిర్యాదు చేసి వస్తున్న రంగారెడ్డి

మాజీ మంత్రి సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి

టీడీపీ నాయకులు చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే

డీఎస్పీని కలిసిన బాధితుడు రంగారెడ్డి

సాక్షి, నెల్లూరు(సెంట్రల్‌): తెలుగుదేశం పార్టీలో గతంలో నమ్మకంగా ఉంటూ మాజీ మంత్రి సోమిరెడ్డికి అండగా ఉంటే తనను సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నట్టేట ముంచారని వెంకటాచలం మండలం ఇడిమేపల్లికి చెందిన ఏలూరు రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి రూరల్‌ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్సీ రాఘవరెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని, సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబర్‌ 58/3 లో 2.41 ఎకరాల పొలం తనకు ఉందని, ఈ పొలం తనకు తమ పూర్వీకుల నుంచి వచ్చిందని తెలిపారు. కానీ సోమిరెడ్డి అప్పట్లో తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తన పొలానికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి ఇతరులకు విక్రయాలు చేశారన్నారు.

ఈ విషయంపై అప్పట్లో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదన్నారు. అలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, తన వద్ద అన్ని పత్రాలు ఉండడంతో సోమిరెడ్డిని ఏ–1 ముద్దాయిగా చేర్చి కేసు నమోదు చేయాలని న్యాయం స్థానం ద్వారా ఆదేశాలు కూడా వచ్చి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కానీ సోమిరెడ్డికి ఉచ్చు బిగుస్తుండడంతో ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీపై బురదజల్లే ప్రయత్నం సాగిస్తుండడం సిగ్గుచేటుగా ఉందన్నారు. తనకు చెందిన పొలంలో తమ పూర్వీకుల సమాధులను కూడా అప్పట్లో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి ధ్వంసం చేయించారన్నారు. తన పొలానికి సంబంధించిన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. తనపై టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు.

>
మరిన్ని వార్తలు