క్షణికావేశంలో గునపంతో దాడి

18 Jul, 2019 11:11 IST|Sakshi
మామ చేతిలో హత్యకు గురైన రాజు

సాక్షి, పిఠాపురం రూరల్‌(తూర్పు గోదావరి): పిఠాపురం మండలం ఎల్‌ఎన్‌ పురంలో పిల్లనిచ్చిన మామే సొంత అల్లుడిని హతమార్చిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎల్‌ఎన్‌ పురానికి చెందిన మృతుడు యలమంచిలి రాజు (36)కు అదే గ్రామానికి చెందిన తప్పిట చంద్రరావు కుమార్తె గాయత్రితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి. కాకినాడలోని వెల్డింగ్‌ పనిచేసే రాజు కొన్నాళ్లుగా మద్యం సేవించి భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మద్యం తాగి బుధవారం రాత్రి తన అత్తగారి ఇంటికి వచ్చిన రాజు భార్యతో గొడవపడి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన మామ చంద్రరావుపైనా దాడి చేయడంతో క్షణికావేశంలో మామ పక్కనే ఉన్న గునపంతో అల్లుడి తలపై బలంగా మోదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజును స్థానికులు పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై చైతన్యకుమార్, ఇన్‌చార్జి గోవిందరాజు పరిశీలించారు. మృతుడి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

>
మరిన్ని వార్తలు