దళితుడిని సీఎం చేయాలి: కృష్ణమాదిగ

5 Mar, 2014 23:41 IST|Sakshi
దళితుడిని సీఎం చేయాలి: కృష్ణమాదిగ
హన్మకొండ, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పాటు కానున్న క్రమంలో కేసీఆర్ వైఖరిలో మార్పు చోటు చేసుకుందని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు అడగకున్నా దళితుడిని సీఎం చేస్తానని, ముస్లిం నాయకుడిని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాడా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.  

వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతుందని, దీనిపై కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్ పార్టీ వైఖరిని వెల్లడించాలని  డిమాండ్ చేశారు.  గతంలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన మాటలపై నిలబడాలన్నారు. బీసీలకు అన్ని రంగాలలో 50 శాతం వాటా కల్పిస్తామని చెప్పారని మంద కృష్ణ గుర్తు చేశారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన క్రమంలో ఎన్నికలపై చర్చించేందుకు గురువారం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు.

 

మరిన్ని వార్తలు