ఇల్లు కట్టిచూడు

15 Jul, 2014 05:09 IST|Sakshi
ఇల్లు కట్టిచూడు

- నింగిని తాకిన నిర్మాణ సామాగ్రి ధరలు
- మార్కెట్‌లో సిమెంటు కొరత  
- స్తంభించిన గృహ నిర్మాణాలు
- ఇబ్బందుల్లో 2.50 లక్షల మంది కార్మికులు

విజయవాడ సిటీ : సామాన్య, మధ్యతరగతి ప్రజలకు  పెరిగిన భవన నిర్మాణ ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర విభజన.. రాజధాని ఏర్పాటు వంటి అంశాల నేపథ్యంలో భూముల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గృహ నిర్మాణ సామగ్రి ధరలు కూడా చుక్కలనంటడంతో జిల్లా వ్యాప్తంగా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఈ రంగానికి అనుబంధంగా 26 రకాల వృత్తులతో జీవనం సాగిస్తున్న సుమారు 2.50 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాలు పనుల్లేక పస్తులుంటున్నాయి. రెండేళ్లుగా రకరకాల ఇబ్బందులతో నిర్మాణ రంగం నత్తనడక నడుస్తోంది.

రాష్ట్ర విభజన క్రమంలో విజయవాడ చుట్టూ  పెండింగులో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు నిర్మాణ సంస్థలు  సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భూముల విలువలకు రెక్కలొచ్చినట్లే నిర్మాణ రంగంలో ముడిసరకుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనికితోడు మార్కెట్‌లో సరకు లభ్యం కాకపోవడంతో నిర్మాణ రంగంలో స్తబ్దత నెలకొంది.  సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకు గృహ నిర్మాణంసమెంటు కృత్రిమ కొరత..
 
కొన్ని కంపెనీలు హఠాత్తుగా సిమెంట్ కొరతను సృష్టించాయి. తెలంగాణ ప్రాంతంలో కంపెనీల నుంచి
 మన ప్రాంతానికి  స్టాక్ ఇవ్వకపోవడంతో నగర మార్కెట్‌లో సిమెంట్ కొరత ఏర్పడింది. దీంతో డీలర్లు తమ వద్ద ఉన్న నిల్వలను అమాంతం నల్లబజారుకు తరలించారు. ఈ క్రమంలో కృత్రిమ కొరత ఏర్పడింది. పైనుంచి స్టాక్ రావడం లేదనే సాకుతో డీలర్లు అమ్మకాలను నిలిపివేశారు. కొద్ది రోజులుగా బ్రాండెడ్ సిమెంటు దొరకక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఎన్నికల ముందు వరకు బస్తా రూ. 230 ఉన్న బ్రాండెడ్ సిమెంటు ఇప్పుడు రూ.350కి విక్రయిస్తున్నారు. బ్లాకులో అయితేనే బ్రాండెడ్ సరకు ఇస్తున్నారు. జిల్లాలో 300కు పైగా సిమెంటు షాపులు, డీలర్లు ఉన్నారు.  వీటి ద్వారా సీజన్‌లో నెలకు 50 వేల టన్నుల సిమెంటు విక్రయాలు జరుగుతుంటాయి. అన్‌సీజన్‌లో కూడా దాదాపు 25 వేల టన్నుల సిమెంటు విక్రయిస్తారని అంచనా. జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల సిమెంటు కొరత ఏర్పడింది.
 
ఇసుకకూ ఇక్కట్లే..
జిల్లాలో 72 ఇసుక క్వారీలున్నాయి. వీటికి ఏడాది నుంచి వేలం పాటలు నిర్వహించకుండా పెండింగులో ఉంచారు. దీంతో ఎక్కడికక్కడ ఇసుక మాఫియాలు పెచ్చుపెరిగి అక్రమ తవ్వకాలు సాగించి అధిక రేట్లు దండుకుంటున్నారు. పదిటైర్ల లారీ ఇసుకకు రూ.17 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. టిప్పర్‌కు రూ. ఏడున్నర వేలు వసూలు చేస్తున్నారు. అదీ దూర ప్రాంతాలకు అయితే మరింత గుంజుతున్నారు.
 
భారీగా పెరిగిన ఇనుము, కంకర ధరలు..

నెల రోజులుగా నగర మార్కెట్‌లో స్టీల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇనుము ధరలు సగటున రూ. 40 వేల నుంచి రూ. 52 వేల వరకు పెరిగాయి. కంకర ధరను కూడా బాగా పెంచేశారు.
 నెల రోజుల క్రితం రెండు యూనిట్ల కంకర రూ. ఆరు వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.10 వేలకు చేరింది. ముడిసరకు ధరలు పెరగడంతో ఆ ప్రభావం భవన నిర్మాణ రంగంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న రాడ్‌బెండింగ్, పెయింటింగ్, కార్పెంటర్, బ్రిక్ ఇండస్ట్రీస్ తదితర వృత్తులలో పనిచేసే కార్మికులు పనుల్లేక, పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. 

మరిన్ని వార్తలు