మైనర్‌ బాలికపై ఎంఈఓ అత్యాచారయత్నం

18 May, 2017 10:27 IST|Sakshi

- పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

హిందూపురం (అనంతపురం జిల్లా) : ఉపాధ్యాయులకు మార్గదర్శిగా.. గురువులకే గురువుగా ఉండాల్సిన మండల విద్యాధికారి (ఎంఈఓ) ఆ స్థానానికే మచ్చ తెచ్చారు. కామంతో కన్ను మిన్ను కానకుండా మైనర్‌ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే....అనంతపురం జిల్లా హిందూపురం మండలం ఎంఈఓ గంగప్ప ఇటీవల విధినిర్వహణలో భాగంగా మిట్టమీదపల్లి గ్రామానికి వెళ్లాడు. గ్రామంలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలికి స్కూల్‌ యూనిఫారాలు జత రూ.35 చొప్పున కుట్టించేలా ఖరారు చేశాడు. ఒప్పందం ప్రకారం తనకు రూ.5 కమీషన్‌ ఇవ్వాలని కూడా  చెప్పాడు.

ఈ విషయం మాట్లాడేందుకు ఈనెల 15న మిట్టమీదపల్లికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు మహిళ లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమె కూతురు(15)తో చనువుగా మాట్లాడాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి బాలికను ముద్దుపెట్టుకున్నాడు. దీంతో బాలిక బయటకు పరుగు తీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఏడుస్తూ కూర్చున్న బాలిక రాత్రి ఇంటికివచ్చిన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు 354ఏ సెక్షన్ కింద పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే కలెక్టర్‌కు కూడా విషయాన్ని తెలియజేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై ఎంఈఓ గంగప్ప వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

మరిన్ని వార్తలు