‘పవన్ కల్యాణ్‌కు మతిభ్రమించింది’

3 Dec, 2019 18:33 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని దసపల్లా భూములు ప్రభుత్వానికి చెందినట్టు గుర్తించినా టీడీపీ హయాంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. మంగళవారం ఆయన విశాఖలో భూఆక్రమణలపై సిట్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం టీడీపీ కార్యాలయం కూడా రికార్డుల మార్పిడిలో జరిగిన అక్రమ వ్యవహారమే అని మండిపడ్డారు.

మెడ్‌ టెక్ భూముల సేకరణలో భారీ అక్రమం జరిగిందని విమర్శించారు. గత సిట్ కూడా పీలా గోవింద్‌పై అభియోగం మోపినా చంద్రబాబునాయుడు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని అమర్‌నాథ్‌ దుయ్యబట్టారు. ఈ భూ కుంభకోణాల్లో గత సీఎం ప్రమేయం వుందని ఆరోపించారు. విశాఖలో జరిగిన లక్షల కోట్ల విలువైన భూ వ్యవహారంలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తప్పకుండా బయటకు వస్తాయని నమ్ముతున్నామని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్‌కు మతిభ్రమించింది..
పవన్ కల్యాణ్‌కు మతిభ్రమించిందని.. విశాఖపట్నం వస్తే మానసిక వైద్యశాలలో చికిత్స అందిస్తామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి  విశాఖ భూ ఆక్రమణలతో సంబంధం ఉందని అనటంతో పవన్‌ మానసికస్థితి ఏంటో తెలియజేస్తుందని మండిపడ్డారు.పవన్ కల్యాణ్‌ సినిమా నిన్నటివరకు టీడీపీని.. ఇప్పుడు కొత్తగా బీజేపీని పొగుడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ప్రజాసంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే పవన్ విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు.

>
మరిన్ని వార్తలు