భూములు బలవంతంగా లాక్కున్నారు

6 Jan, 2020 19:45 IST|Sakshi

సాక్షి, అనంతపురం: అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగగా చంద్రబాబును పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్షగా పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే కొత్త రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణ కమిటీ తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వకముందే చంద్రబాబు నారాయణ కమిటీ వేశారన్నారు.

ఆ వెంటనే అమరావతిలో పేద రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ఆరోపించారు. 1953లో జరిగిన శ్రీబాగ్‌ ఒప్పందం చంద్రబాబుకు గుర్తులేదా?అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఒప్పందం ప్రకారం రాజధాని ఓ చోట, హైకోర్టు మరో చోట పెడితేనే సమతుల్యత సాధ్యమని నొక్కి చెప్పారు. మూడు పంటలు పండే భూముల్లో రాజధాని సమంజసమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు