కన్న పేగును చిదిమేసింది

14 May, 2016 03:57 IST|Sakshi
కన్న పేగును చిదిమేసింది

జల్సాలకు అడ్డుగా ఉన్నాడని... గొంతుకు తాడు బిగించి హతం
పోస్టుమార్టంతో వెలుగులోకి నిందితురాలి అరెస్టు


ప్రాపంచిక సుఖాలు మనిషిని మృగంగా మారుస్తాయనడానికి ఇదొక నిదర్శనం. జల్సాలకు అలవాటు పడ్డ ఆమెకు కన్న పేగు అడ్డుగా మారింది. కర్కశంగా గొంతుకు తాడు బిగించి చిన్నారిని హత్య చేసింది.  ఈ సంఘటన చిత్తూరులో ఆలస్యంగా శుక్రవారం పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చింది.
 
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని దుర్గానగర్‌కు చెందిన రేఖ (20) బెంగళూరు చెందిన ఒక యువకుడిని 2013లో పెళ్లి చేసుకుంది. వారికి యశ్వంత్ అనే తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు. ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడంతో కొంత కాలం క్రితం ఆ యువకుడు భార్యను వదిలేశాడు. ఆమె పుట్టినిల్లు చిత్తూరుకు చేరుకుంది. ఇక్కడ ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో జల్సా జీవితానికి అలవాటు పడ్డ రేఖకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మార్చి 9న ఇంట్లో పిల్లాడు ఏడుస్తుండగా కోపం వచ్చి గొంతుకు తాడును బి గించి చంపేసింది. తాను వచ్చి చూసే సరికి పిల్లాడు గుక్కపెట్టి ఏడ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని చుట్టుపక్కల వారిని నమ్మించింది. బిడ్డను తీసుకుని నగరంలోని బౌండి వీధిలో ఉన్న తన చిన్నాన్న చినబాబు ఇంట్లో వదిలి పారిపోయింది.

బిడ్డ మృతి చెందిందని గుర్తించిన చినబాబు అదే రోజు అంత్యక్రియలు సైతం చేశాడు. అనంతరం బిడ్డ మృతిపై అనుమానం ఉందని చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ ప్రసాద్ రెవెన్యూ అధికారుల సమక్షంలో బిడ్డ మృతదేహానికి పోస్టుమార్టం చేసి మళ్లీ అంత్యక్రియలు చేశారు. బిడ్డ గొంతుకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే చనిపోయినట్లు రెండు రోజుల క్రితం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే నిందితురాలు రేఖను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె పోలీసుల ఎదుట అసలు విషయం ఒప్పుకుంది. ఆమెపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

మరిన్ని వార్తలు