టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ ఇటీవల కాలంలో అత్యంత రహస్యంగా ఢిల్లీలో పర్యటించి వచ్చారు. ఎవ్వరికీ తెలియకుండా తనకు అత్యంత సన్నిహితులైన ఒకరిద్దరు స్నేహితులను వెంట పెట్టుకుని ఉదయాన్నే ఢిల్లీ వెళ్లిన ఆయన సాయంత్రానికి మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. ఆకస్మికంగా ఆయన ఢిల్లీ వెళ్లటంపై ఇప్పుడు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. తనకు సన్నిహితులైన పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, నామా, రమేష్లకు కూడా సమాచారం ఇవ్వకుండా చినబాబు రహస్యంగా ఢిల్లీ వెళ్లడంపై ఎంపీల్లో కూడా చర్చ సాగుతోంది. లోకేష్ గతంలో ఒక టీవీ చానల్ను పర్యవేక్షించేవారు. ఈ మధ్య కాలంలో ఆ చానల్ పార్టీకి దూరమైందట!
ఇటీవల చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రకు ఎక్కువ సమయం కవరేజీ కోసం కొన్ని చానళ్లకు కోట్లాది రూపాయలు చెల్లించారు. ఇలాంటి సందర్భాల్లో ఎవరో ఒకరికి డబ్బులు చెల్లించే కంటే మనమే తెరవెనుక ఉండి ఒక చానల్ను నడిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చినబాబుకు వచ్చిందట. దీంతో ఎన్నికల సమయానికి ఎలాగైనా ఒక సొంత చానల్ను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంతోకాలం నుంచి కసరత్తు చేస్తున్న లోకేష్ దాన్ని కార్యరూపంలో పెట్టేందుకు ఢిల్లీకి వెళ్లారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించిన ఒక చానల్ను కొనుగోలు చేసేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారట.
ఆ చానల్ కొనుగోలుకు అవసరమైన సొమ్మును రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నేత ఒకరు సమకూర్చారట! ఇటీవల చంద్రబాబు నిర్వహించిన వస్తున్నా మీకోసం పాదయాత్రలో పూర్తి కాలం పాల్గొన్న, ఆయన పాదయాత్రను గ్రంధస్తం చేసిన, చేస్తున్న, పార్టీకి అనుకూలురుగా పనిచేస్తున్న పాత్రికేయులను ఆ చానల్లో పని చేసేందుకు ఇప్పటికే లోకేష్ స్వయంగా ఎంపిక చేశారట. తాను ఏది చేసినా ఈనోటా...! ఆనోటా బయటికి పొక్కుతోందన్న ఉద్దేశంతోనే చినబాబు అత్యంత రహస్యంగా ఢిల్లీ వెళ్లొచ్చారట. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి రాకముందే ఆ విషయం ఎన్టీఆర్ భవన్లో గుప్పుమనడం విశేషం.!!