స్టార్‌ హీరోలతో పని చేశాడు.. కుటుంబసభ్యుల మరణంతో ఒంటరి.. బస్‌ టికెట్‌కు కూడా డబ్బుల్లేక..

25 Nov, 2023 14:59 IST|Sakshi

కెరీర్‌ను సరిగా ప్లాన్‌ చేసుకోకపోతే చిక్కుల్లో పడక తప్పదు. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఎప్పుడు అవకాశాలు వస్తాయో, ఎప్పుడు ఛాన్సులు రాకుండా పోతాయో ఊహించడం కష్టం. ఇప్పుడు చెప్పుకునే నటుడికి కూడా ఇదే జరిగింది. అప్పటిదాకా సూపర్‌ స్టార్స్‌తో కలిసి నటించిన ఈయనకు ఆ తర్వాత అవకాశాలు రావడమే గగనమైపోయింది.. ఇంతకీ ఆ నటుడెవరో చూద్దాం..

సడన్‌గా వాచ్‌మెన్‌గా...
బ్లాక్‌ ఫ్రైడే, గులాల్‌, పటియాలా హౌస్‌ వంటి పలు చిత్రాల్లో సవి సిద్ధు నటించాడు. ఇతడు పోషించింది చిన్నపాత్రలే అయినా వాటికి మంచి ఆదరణ ఉండేది. అక్షయ్‌ కుమార్‌, కేకే మీనన్‌ వంటి స్టార్స్‌తో నటించాడు. అనురాగ్‌ కశ్యప్‌, నిఖిల్‌ అద్వాణీ వంటి ప్రముఖ దర్శకుల డైరెక్షన్‌లో యాక్ట్‌ చేశాడు. కానీ 2019లో ముంబైలోని ఓ భవంతి ముందు ఇతడు వాచ్‌మెన్‌గా దర్శనమిచ్చాడు. అవకాశాలు రాకపోవడం వల్లే సినిమా ఇండస్ట్రీకి దూరమై వాచ్‌మెన్‌గా మారానని చెప్పుకొచ్చాడు.

అందరూ వదిలేసి పోయారు
సవి మాట్లాడుతూ.. 'నా జీవితంలో కోలుకోలేని దెబ్బ.. నా భార్య మరణం. తర్వాత అమ్మానాన్న కూడా చనిపోయారు. ఒక్కడినే మిగిలాను. ఒంటరివాడినయ్యాను. ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలా సమయమే పట్టింది. కానీ అప్పుడు అవకాశాలు రాలేదు. ఖాళీగా కూర్చుంటే పొట్ట నింపుకోవడం కష్టమని వాచ్‌మెన్‌గా చేరాను. 12 గంటల పాటు పని చేయాలి. ఎక్కడికైనా వెళ్లడానికి బస్సు టికెట్‌ కూడా కొనుకోలేని దీనస్థితిలో ఉన్నాను.

అప్పుడు రీఎంట్రీ.. ఆ తర్వాత..
ఇప్పుడు థియేటర్‌లో సినిమా చూడటం అనేది కూడా నాకు అందని ద్రాక్షగా మారింది. నా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు' అని పేర్కొన్నాడు. అప్పుడు ఈ ఇంటర్వ్యూ వైరల్‌గా మారగా అనురాగ్‌ కశ్యప్‌, రాజ్‌కుమార్‌ రావు అతడికి మద్దతుగా నిలబడ్డారు. ఛాన్సులు రావడానికి సాయపడతామన్నారు. అలా సవి 2020వ సంవత్సరంలో మస్కా సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ తర్వాత సవి గురించి ఏ సమాచారమూ బయటకు రాలేదు.

చదవండి: బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి రెస్టారెంట్‌ బిజినెస్‌.. చివరకు దాన్ని కూడా మూసేసి..

మరిన్ని వార్తలు