‘సొంత తమ్ముడి మతిభ్రమించడానికి చంద్రబాబే కారణం’

25 Mar, 2019 12:06 IST|Sakshi

జూనియర్ ఎన్టీఆర్ మామ వైఎస్సార్‌సీపీ నాయకులు నార్నె శ్రీనివాసరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. సభల్లో సమావేశాల్లో తరుచూ తమ్ముళ్లూ, తమ్ముళ్లూ అంటూ సంభోదించే చంద్రబాబు తన సొంత తమ్ముడు ఎక్కడున్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుగు ప్రజలకు చెప్పగలడా అని సాక్షి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సవాలు విసిరారు. 

చంద్రబాబు తమ్ముడు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?
చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు 1994లో రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్‌ దగ్గర టికెట్‌ కోసం పోరాడితే, చంద్రబాబు ఇవ్వొద్దని అడ్డుకున్నారు. అప్పుడు లక్ష్మీ పార్వతి దగ్గరుండి రామ్మూర్తినాయుడికి టికెట్‌ ఇప్పించి పంపిస్తేనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అదే రామ్మూర్తి నాయుడికి మరోసారి చంద్రబాబు మోసం చేసి టికెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా నిలబడి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు సెట్‌అవ్వకముందు కష్టపడి ఖర్చుల కోసం అతనికి డబ్బులు పంపించేవారు. అన్నను ఎంతగానో ప్రేమిస్తే, టికెట్‌ విషయంలో చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రామ్మూర్తి నాయుడు మతిస్థిమితం కోల్పోయారు. రామ్మూర్తి నాయుడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ తెలియదు. ఈ రోజు గొలుసులు, తాళ్లతో కట్టేసి అతన్ని ఒక రూములో బంధించి పెడుతున్నారు. దమ్ముంటే సొంత తమ్ముడిని బయటికి తీసుకువచ్చి చూపించమనండి. అన్న మీద గుడ్డి నమ్మకంతో అన్నీ చేసిన తర్వాత మోసం చేయడంతో మతిస్థిమితం లేకుండా అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇటీవల ఎన్నికల అఫిడవిట్‌లో కూడా కోట్లకొద్ది ఆస్తులున్నట్టు పేర్కొన్నాడు. అలాంటింది సొంత తమ్ముడిని తీసుకెళ్లి ఓ ఆసుపత్రిలో చికిత్స చేపించలేడా. చంద్రబాబు ఒక మర్రి చెట్టులాంటివాడు. అతను ఎదుగుతాడు. మర్రిచెట్టు కింద గడ్డిపోచను కూడా మొలవనివ్వడు.

చంద్రబాబు ఎదుగుదల కోసం దేనికైనా సిద్ధపడుతాడు
తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడుది కాదు. హరిక్రిష్ణ పెట్టిన భిక్షవల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. హరిక్రిష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వర్లు పక్కనుండి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే ఆ తర్వాత వారు ఎక్కడున్నారు. చంద్రబాబు నాయుడు వలస వచ్చినవాడు. చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం పార్టీ బాగుండేది. కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వలసొచ్చి ఈ రోజు అదే కాంగ్రెస్‌ పార్టీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. అతని ఎదుగుదల కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతాడు. దేనికైనా సిద్ధపడుతాడు. మనుషులని వాడుకుని, వదిలేయడం అతని నైజం. 

మోహన్‌ బాబు నోరు తెరిస్తే..
నిన్నకాక మొన్న పిల్లలతో కలిసి మోహన్‌ బాబు రోడ్డుపైకి వచ్చారు. టీడీపీ వాళ్లు మోహన్‌ బాబును బెదిరిస్తున్నారు. చంద్రబాబుది, మోహన్‌ బుబుది పక్క పక్క ఊర్లే. రామారావు దగ్గర చంద్రబాబు, లక్ష్మీ పార్వతి ఉన్నప్పుడు మోహన్‌ బాబు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో ఏమేం జరిగిందో మొత్తం మోహన్‌ బాబుకు తెలుసు. ఒక వేళ మోహన్‌ బాబు నోరు తెరిస్తే బాబు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా దిక్కుతోచని పరిస్థితిలోకి వెళతాడు. 

చంద్రబాబువి అన్నీ దొంగ ట్రిక్కులు
హరిక్రిష్ణకు అన్యాయం చేసాడని అందరూ అనే సరికి.. హరిక్రిష్ణ కూతురు సుహాసికి న్యాయం చేస్తున్నానని చెప్పి, ఆమెను తీసుకొచ్చి ఓడిపోయే కూకట్‌పల్లి సీటిచ్చారు. రాజమండ్రిలో నివసిస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో పోటికి నిలుచోబెట్టడం ఏంటి? మంచి చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోనే టికెట్‌ ఇచ్చేవాడు కదా. ఇవ్వన్నీ దొంగ ట్రిక్కులు. ఇటువంటివి చంద్రబాబు దగ్గర చాలా చూశా. 

1998లోనే హ్యాండిచ్చాడు..
1998లోనే చంద్రబాబు నాయుడు నన్ను పిలిచి చిలుకలూరి పేట టికెట్‌ ఇస్తా అని చెప్పాడు. దీంతో అక్కడే రెండేళ్ల పాటూ ఉండి దాదాపు కోటి రూపాయలు ఖర్చు కూడా చేశా. చివరి నిమిషంలో టికెట్‌ వేరే వ్యక్తికి ఇచ్చాడు. బంధువులను ఎవరినీ ఎదగనివ్వడు. నాతోపాటూ మరో 300 మందికి రాజ్యసభ సీటిస్తా అని హామీ ఇచ్చాడు. చంద్రబాబును ఎన్నో ఏళ్లుగా పక్కనుంచే చూశా. కుల పిచ్చి, గజ్జి ఉంది చంద్రబాబునాయుడుకే. వైఎస్‌ జగన్‌ చేసేదే చెబుతారు. అమలు చెయ్యలేనివి అస్సలు చెప్పరు. చంద్రబాబు అన్ని చెబుతాడు. ఏమీ చేయడు. పాలనలో తండ్రిని మించిన తనయుడు వైఎస్‌ జగన్‌ అవుతారు.   కేవలం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికే పార్టీలోకి వచ్చా. దీని తర్వాత రాజకీయాల్లో కొనసాగను.

మరిన్ని వార్తలు