ప్రశాంతంగా కౌంటింగ్‌కు తగిన భద్రతా చర్యలు

19 May, 2019 09:06 IST|Sakshi
భద్రతా ఏర్పాట్లపై చర్చిస్తున్న జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌

సాక్షి, ఒంగోలు: కౌంటింగ్‌ గడువు దగ్గర పడుతున్న దృష్ట్యా కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ అధికారులతో చర్చించారు. స్థానిక రైజ్‌ కాలేజీలోని కౌంటింగ్‌ కేంద్రంలో అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రైజ్‌ కాలేజీ, పేస్‌ కాలేజీల్లోకి కేవలం వ్యక్తులను మాత్రమే అనుమతించాలని, వాహనాలను అనుమతించరాదని సూచించారు. అభ్యర్థులకు, పోలింగ్‌ ఏజెంట్లకు ఒక మార్గం, అధికారులకు, పోలింగ్‌ సిబ్బందికి ఒక మార్గం, మీడియా ప్రతినిధులకు మరో మార్గం ద్వారా లోపలకు అనుమతించేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

వాహనాలను బయట పార్కు చేసుకునేందుకు అవసరమైన స్థలాలను సిద్ధం చేయాలన్నారు. పెళ్లూరు హైవే డౌన్‌ నుంచి వల్లూరు హైవే డౌన్‌ వరకు ఒక మార్గంలో మాత్రమే ట్రాఫిక్‌ను పంపాలని, రెండో మార్గం కేవలం ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు, పర్యవేక్షించేందుకు వచ్చే వారికోసం సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ డైవర్షన్‌ బోర్డులు, ట్రాఫిక్‌ సైన్‌ బోర్డులు, పార్కింగ్‌ బోర్డులు సిద్ధంగా ఉంచాలన్నారు. రైజ్‌ కాలేజీ సెంటర్‌ ఇన్‌చార్జి ఎం వెంకటేశ్వరరావు, పేస్‌ కాలేజీ ఇన్‌చార్జి డాక్టర్‌ బి.రవిలతో పాటు ఆర్‌అండ్‌బీ అధికారులు, పోలీసు అధికారులతో ఏర్పాట్లపై ఎస్పీ సమీక్షించారు.

మరిన్ని వార్తలు