‘2019లో టీడీపీ గెలవదు.. పార్టీ మారను’

17 Sep, 2017 13:23 IST|Sakshi
‘2019లో టీడీపీ గెలవదు.. పార్టీ మారను’

సాక్షి, కర్నూలు: తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తోసిపుచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీలోకి మరే ప్రసక్తే లేదని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి రాదని ఆయన జోస్యం చెప్పారు. కోట్ల కుటుంబానికి కొన్ని విలువలు ఉన్నాయని.. వాటికి కట్టుబడి ఉంటానని, పార్టీ మారబోనని ఆయన స్పష్టం చేశారు. సూర్యప్రకాశ్‌ రెడ్డి పార్టీ మారతారని గతంలో కూడా వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఆయన ఇదే మాట చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని, తన కుటుంబ సభ్యులు కూడా పార్టీ మారబోరని ఆయన వెల్లడించారు.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ రైతుల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమై, సీమ ద్రోహిగా మిగిలిపోయారని గతంలో కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకులు దోచుకోవడానికే పరిమిత మయ్యారని ఆయన ఆరోపించారు.