అక్కరకు రాని నూతన ప్రాజెక్ట్టులు

30 Nov, 2013 06:02 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్: అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు అవసరమైన చోట్ల కొత్త సీడీపీవో ప్రాజెక్టులను నెలకొల్పినప్పటికీ ప్రయోజనం కనిపించటం లేదు. ప్రాజెక్టులు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా.. నేటికీ అవి తెరుచుకోకపోవడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. దుమ్ముగూడెం మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాజెక్టును శుక్రవారం ‘న్యూస్‌లైన్’ పరిశీలించగా ఇది తేటతెల్లమైంది.

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల పరిస్థితి దాదాపు ఇదే రీతిన ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 4,888 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సుమారు 1.50 లక్షల మంది పిల్లలకు, 30 వేల మంది గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఇందుకుగాను జిల్లాలో 15 సీడీపీవో ప్రాజెక్టులు ఉండగా, కొత్తగా దుమ్ముగూడెం, చర్ల,  చింతూరు, దమ్మపేట, మణుగూరు, సత్తుపల్లి, కారేపల్లి, ఏన్కూర్ మండలాల్లో ప్రాజెక్టులు ప్రారంభించారు. గతంలో ఆయా మండలాల్లో ఉన్న ఐఎస్‌డీఎస్ సూపర్‌వైజర్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలను కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టులకు కేటాయించారు.
 వీటిని పర్యవేక్షించేందుకు సీడీపీవోలను నియమించారు. అయితే ఈ తతంగమంతా జరిగి మూడు నెలలు కావస్తున్నా కొత్త ప్రాజెక్టులు గాడిన పడలేదు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఆయా మండలాల్లో అద్దెకు గదులు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ చాలా చోట్ల అమలుకు నోచుకోలేదు. కొన్నిచోట్ల భవనాలు తీసుకున్నప్పటికీ సక్రమంగా తెరవటం లేదు. ఇలా కొత్త ప్రాజెక్టులతో ఎలాంటి ఉపయోగం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 పొరుగునున్న ప్రాజెక్టుల
 నుంచి పర్యవేక్షణ...
  కొత్తగా సీడీపీవో ప్రాజెక్టులను ఏర్పాటు చేసినప్పటికీ నిరుపయోగంగా మారడంతో గతంలో ఉన్న సీడీపీవో ప్రాజెక్టుల నుంచే ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. దుమ్ముగూడెంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టును తెరవకుండా భద్రాచలం సీడీపీవో కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తున్నారు. చింతూరు, చర్ల మండలాల్లోనూ ఇంకా కార్యాలయాలు తెరుచుకోలేదు. చింతూరులో ఓ హాస్టల్ భవనంలో, చర్లలో బీఎస్‌ఎన్‌ఎల్ భవనాల్లో ప్రారంభించాలని భావించినా అది ఆచరణకు నోచుకోలేదు.

మిగతా మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. దీంతో కొత్తగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ప్రయోజనమేంటని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 1న ప్రవేశపెట్టిన బాలామృతం పథకం కూడా సవ్యంగా అమలు కావటం లేదు. గతంలో మాదిరే పిల్లల ఇళ్లకు సరుకులు ఇవ్వకుండా  మిక్స్‌డ్ ఫుడ్ అందించేలా కేంద్రాలకే ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. అయితే వీటిపై సరైన పర్యవేక్షణ లేకపోవటంతో పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 సకాలంలో సరఫరా కాని సరుకులు...
   కొత్తగా సీడీపీవో ప్రాజెక్టులను ప్రారంభించిన మండలాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు సకాలంలో సరుకులు అందటం లేదు. దుమ్ముగూడెం మండలాన్నే పరిశీలిస్తే.. ఇక్కడ 135 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 3,376 మంది పిల్లలు, గ ర్భిణులు, బాలింతలు కలిపి 876 మంది ఉన్నారు. ఈ కేంద్రాలకు కొత్తగా ఏర్పాటు చేసిన సీడీపీవో ప్రాజెక్టు నుంచే వంట సరుకులు సరఫరా చేయాల్సి ఉంది. కానీ భద్రాచలం ప్రాజెక్టు నుంచే నేటికీ సరుకులు సరఫరా చేస్తున్నారు. అయితే ఆయా కేంద్రాలకు సకాలంలో అందడం లేదు. ఎక్కడ నుంచి సరుకులు సరఫరా చేస్తారనే దానిపై కేంద్రాల కార్యకర్తలకు కూడా స్పష్టత లేకపోవటంతో వారు మౌనం దాల్చుతున్నారు. దుమ్ముగూడెం మండలంలో నవంబర్ మొదటి వారంలో సరఫరా చేయాల్సిన సరుకులు నెలాఖరుకు కూడా అందలేదు. కొన్ని చోట్ల గుడ్లు సరఫరా చేయలేదు. వారంలో రెండు రోజులు పిల్లలకు గుడ్లు పెట్టాల్సి ఉన్నప్పటికీ అది అమలుకు నోచుకోవటం లేదు. చింతూరు, చర్ల మండలాల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో ఉన్న ప్రాజెక్టుల నుంచే పాలన మొత్తం సాగుతుండటంతో వీటి పనితీరు అస్తవ్యస్థంగా ఉంది.
 ప్రాజెక్టులు తెరవకపోతే కఠిన చర్యలు : సుఖజీవన్‌బాబు, ఐసీడీఎస్ పీడీ,
 అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరిచేందుకే కొత్తగా సీడీపీవో ప్రాజెక్టులను ప్రారంభించాము. ఆయా మండలాల్లో వీటి నిర్వహణకు అద్దె ప్రాతిపదికన భవనాలు కూడా తీసుకోవాలని చెప్పాం. కేంద్రాలకు సంబంధించిన సరుకులు కూడా నేరుగా కాంట్రాక్టర్‌నే సరఫరా చేయాలని ఆదేశించాం. ఎల్‌డీసీలను ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌పై పంపిస్తున్నాము. అవసరమైన చోట్ల తాత్కాలిక ప్రాతిపదికన స్వీపర్, ఇతర సిబ్బందిని కూడా తీసుకోవాలని సీడీపీవోలకు సూచించాం. కేంద్రాలు తెరవకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. 

>
మరిన్ని వార్తలు