డీజిల్ కోసం బిందెలు, బకెట్లతో పరుగులు..

17 May, 2015 13:24 IST|Sakshi

జి.కొండూరు: ఆదివారం మద్యాహ్నం.. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం.. బిందెలు, బకెట్లు, కుండలు.. ఇలా ఏదిదొరికితే దాన్ని తీసుకుని జనం పరుగులు పెట్టారు. ఎండాకాలం కదా అగ్నిప్రమాదమేదైనా సంభవించిదా.. మంటలు ఆర్పేందుకే వీళ్లు వెళుతున్నారా? అని చూసేవాళ్లు సందేహపడ్డారు. అసలు విషయమేమంటే.. కట్టుబడిపాలెం గ్రామంలోని హెచ్‌పీసీఎల్ కంపెనీకి చెందిన పైపులైన్లు లీకై వాటినుంచి డీజిల్ అంతెత్తున ఎగిసిపడింది.

అసలే డీజిల్ రేట్లు మండిపోతున్న తరుణంలో దానిని తెచ్చుకునేందుకు జనం ఇలా పరుగులు పెట్టారు. హెపీసీఎల్ కంపెనీ స్టోరేజీ ట్యాంకర్ల సమీపంలో పైపులైన్ నుంచి భూమిపైకి డీజిల్ చొచ్చుకొచ్చి సమీప డ్రైనీజీలో కలిసినట్టు గుర్తించిన కొందరు తమవారికి సమాచారం ఇవ్వడంతో ఈ పరుగుల ప్రహాసనం మొదలైంది. చివరికి అధికారులు చేరుకుని మరమ్మతులు చేసి ఆయిల్ లీకేజీని నియంత్రించారు. పైపులైన్ అడుగు భాగంలో దెబ్బతినడం వల్లే లీకేజీ చోటు చేసుకుందని చెప్పారు. ఇదే ప్రాంతంలో గతంలో రెండు సార్లు లీకేజీలు చోటు చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు