శ్రీశైలం నిధుల స్వాహా కేసులో మరికొందరి హస్తం  

31 May, 2020 07:53 IST|Sakshi

మలుపులు తిరుగుతున్న శ్రీశైలం నిధుల స్వాహా కేసు 

మరో ఆరుగురు నిందితుల గుర్తింపు 

సొమ్ము రికవరీ దిశగా ప్రయత్నాలు

సాక్షి, శ్రీశైలం: దేవస్థానం అభిషేకాది ఆర్జిత సేవా టిక్కెట్లు, దర్శన కౌంటర్లు, డొనేషన్‌ కౌంటర్, పెట్రోల్‌బంక్‌లో జరిగిన అక్రమాల్లో 20 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీస్‌ విచారణలో మరో ఆరుగురి హస్తం కూడా ఉన్నట్లు తేలింది. నిందితుల్లో 16 మంది..నిజాన్ని ఒప్పుకొని, నిధులు ఎలా స్వాహా చేశారో చెప్పారని డీఎస్పీ వెంకట్రావ్‌కు తెలియజేశారు. ముఖ్యంగా దేవస్థానంలో కంప్యూటర్‌ విభాగంలో పనిచేస్తున్న దార్శెల్లి, రూపేష్‌.. ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు తెలిసింది. ఒకరి ఐడీపై మరొకరు టిక్కెట్లను అక్రమ మార్గంలో విక్రయించారు.

సాంకేతికతను ఆధారం చేసుకుని ఫేక్‌ ఐడిని సృష్టించి దాని ద్వారా అక్రమార్జనకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ ప్రక్రియ అంతా 2017లో జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దేవస్థానం ఈఓ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారే కాకుండా పోలీసులు విచారణలో..హరినాయక్, చంద్ర, మురళీధర్‌రెడ్డి, రామనాయుడు, అనీల్, నరసింహులు హస్తం కూడా ఉన్నట్లు నిర్ధారించారు.  వీరిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: చరిత్ర గతిని మార్చే పాలన

మొత్తం మీద 23 మంది నిందితులు అక్రమాలను ఒప్పుకోవడంతో.. వీరి వద్ద నుంచి అక్రమార్జిత సొమ్మును సాధ్యమైనంతవరకు రికవరీ చేసేందుకు డీఎస్పీ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దేవస్థానం ద్వారా వచ్చిన రెండు కేసులే కాకుండా విడివిడిగా ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఉన్న కేసులను ఆధారం చేసుకుని దేవస్థానంలోని మరికొన్ని కీలక విభాగాల్లో ఉద్యోగులను దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది.    

మరిన్ని వార్తలు