మరోసారి ముద్రగడ పాదయాత్ర యత్నం!

14 Aug, 2017 12:04 IST|Sakshi
మరోసారి ముద్రగడ పాదయాత్ర యత్నం!

అడ్డుకున్న పోలీసులు.. మండిపడ్డ కాపు నేత

కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు ప్రయత్నించారు. కాపులకు బీసీ రిజర్వేషన్‌ కల్పించాలని 'ఛలో అమరావతి' పేరిట పాదయాత్ర చేపట్టేందుకు గత కొన్నిరోజులుగా ముద్రగడ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే పాదయాత్ర కోసం కిర్లంపూడిలోని తన నివాసం నుంచి ఆయన బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని ఇంటి గేటు వద్ద ఆయనను నిలువరించారు. దీంతో కాపు నేతలు భగ్గుమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ ధర్నా నిర్వహించారు. కిర్లంపూడిలో నల్లజెండాలు పట్టుకొని నిరసన తెలిపారు.

తన పాదయాత్రను మరోసారి అడ్డుకోవడంపై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించినప్పుడు తీసుకున్న అనుమతి ఏమిటో, ఆ పత్రం ఏమిటో తనకు చూపాలని, అదే తరహాలో తాను కూడా అనుమతి తీసుకొని పాదయాత్ర చేస్తానని అన్నారు. వేలమంది పోలీసులను కిర్లంపూడిలో మోహరించి తన పాదయాత్రను అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు