సాక్షి, అనంతపురం : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేడు 35వ రోజుకి చేరుకుంది. గురువారం ఉదయం రాప్తాడు మండలంలోని గంగలకుంట నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం అయ్యింది. ముందుగా కందుకూరు కు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరిస్తారు. ఆపై హంపాపురం క్రాస్ వద్ద చేరుకుని అక్కడ ఆయన జనంతో మమేకం అవుతారు. చివరకు చిగిచర్ల వరకు చేరుకోగానే పాదయాత్ర ముగుస్తుంది . ఇప్పటిదాకా ఆయన 457.8 కిలోమీటర్లు నడిచిన విషయం తెలిసిందే. పాదయాత్రలో అడుగడుగునా జగనన్నకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు తాము టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎదుర్కుంటున్న అన్యాయాలను ఆయనకు వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. వారికి భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.