సైకోలను సమాజంలో తిరగనివ్వరాదు

4 Dec, 2019 12:05 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తేజస్విని (ఫైల్‌ ఫోటో)

సాక్షి, పోడూరు : ప్రేమోన్మాది దాడి చేస్తాడని కలలో కూడా ఊహించలేకపోయానని, దాడి వల్ల గాయాలతో తాను చావకుండానే నరకం చూశానని కవిటం గ్రామంలో ఈ ఏడాది అక్టోబర్ 16న ప్రేమోన్మాది చేతిలో హత్యాయత్నానికి గురైన కళాశాల విద్యార్థిని కొవ్వూరి తేజస్విని చెప్పింది. దాడి తరవాత ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె కొద్దిరోజుల కిందట కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి కవిటంలో తన నివాసానికి వచ్చింది. ఇంటి వద్ద మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన సుధాకర్‌రెడ్డి లాంటి సైకోలు సమాజంలో తిరగకూడదని చెప్పింది. తన లాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని పేర్కొంది. పెనుగొండ ఎస్‌వీకేపీ కళాశాలలో తాను ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్టీ‍్ర ఫస్టియర్‌ చదువుతున్నానని, ఈ కోర్సు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయాలనుకున్నానని.. ఈ కోర్సు పూర్తి చేయడమే తన లైఫ్‌ టర్నింగ్‌పాయింట్‌ అని.. ఇటువంటి తరుణంలో ప్రేమ పేరుతో కొంతకాలంగా తనను వేధిస్తున్న మేడపాటి సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి తనను చంపే ప్రయత్నంతో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో తాను జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్నానని తేజస్విని ఆవేదన వ్యక్తం చేసింది.

తనపై ఉన్మాదంతో దాడి చేసిన మేడపాటి సుధాకర్‌రెడ్డి బెయిల్‌ తీసుకొని జైలు నుంచి బయటకు వస్తాడని వదంతులు వస్తుండడంతో కొద్దిరోజులుగా తాను ఎంతో ఆందోళన చెందుతున్నట్టు తేజస్విని చెప్పింది. సుధాకర్‌రెడ్డి తనపై దాడి తరవాత వెంటనే స్పందించి ఆసుపత్రికి చేర్చిన పోలీసులకు, గ్రామస్తులకు, మంచి వైద్యం అందేలా కృషి చేసిన రాష్ట్ర మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు, ఆళ్లనానికి, వైఎస్సార్‌సీపీ నేత గుంటూరి పెద్దిరాజుకు, గ్రామ నాయకులు కర్రి శ్రీనివాస్‌రెడ్డికి, సత్తి మురళీకృష్ణారెడ్డికి తేజస్విని కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వార్తలు