దండిగాం రోడ్డు వరకూ రైల్‌బస్

20 Dec, 2013 06:59 IST|Sakshi


 సాలూరు రూరల్,న్యూస్‌లైన్ :
 సాలూరు ప్రాంత ప్రజల కల మరి కొద్ది రోజుల్లో కార్యరూపం దాల్చనుంది.  పెరుగుతున్న ఆర్టీసీ బస్సు చార్జీల నేపథ్యంలో రైల్వే చార్జీలు తక్కువగా ఉండడంతో రైల్‌బస్‌లో ప్రయాణించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బొబ్బిలి-సాలూరు మధ్య నడుస్తున్న రైల్‌బస్‌ను దండిగాం రోడ్డు వరకూ పొడిగించడానికి రైల్వే శాఖ నిర్ణయించింది.
 
 మక్కువ బైపాస్ రోడ్డు మార్గంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు పట్టణ, పరిసర ప్రాంత ప్రయాణికులు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దండిగాం రోడ్డు వరకు రైల్‌బస్‌ను నడిపితే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుందని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు.  సాలూరు పట్టణానికి దగ్గరగా ఉన్న దండిగాం రోడ్డు వరకు రైల్వేట్రాక్ ఉంది. రైల్‌బస్‌ను పొడిగించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర   కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఇంద్రసేన్‌కు లేఖ రాశారు. ఇందుకు వారి స్పందించి రైల్‌బస్‌ను పొడిగించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజన్నదొర వద్ద ఫోన్‌లో ప్రస్తావించగా సాలూరు ప్రజలు సౌకర్యార్థం రైల్‌బస్‌ను పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నారని, రైల్వే జీఎం నుంచి లేఖ తనకు వచ్చిందని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే సంబందిత పనులు చేపట్టనున్నట్టు లేఖలో పేర్కొన్నారన్నారు.
 
 సర్వత్రాహర్షం
 రైల్ బస్ సేవలను వినియోగించుకోవాలని సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సాలూరు పరిసర ప్రాంత వాసులకు విషయం తెలియడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. సాలూరు నుంచి బొబ్బిలికి ఆర్టీసీ బస్సులో వెళ్లాలంటే 15 రూపాయలు చార్జీ వసూళు చేస్తున్నారని, అదే రైల్‌బస్‌లో వెళితే కేవలం 5 రూపాయలు సరిపోతుందని చెబుతున్నారు.

 

>
మరిన్ని వార్తలు