హైదరాబాద్: వివిధ నగరాల పరిశీలనలో భాగంగా ఏపీ రాజధాని సలహా కమిటీ గురువారం ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్ను సందర్శించింది.కమిటీ చైర్మన్, మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అక్కడి నిర్మాణాలను పరిశీలించారు.
భూగర్భ విద్యుత్ సరఫరా, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పార్కులు, విశాలమైన రహదారులు, ప్రభుత్వ భవన సముదాయాలను పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు వివరాలను నిపుణులను అడిగి తెలుసుకున్నారు. గ్రీన్బెల్టుల ఏర్పాటు, చెరువులు, నీటి వనరుల తీరు అబ్బురపరిచే విధంగా ఉన్నాయని కమిటీ అభిప్రాయపడింది.