బోండా ఉమా భార్యకు నోటీసులు

26 Feb, 2018 13:32 IST|Sakshi
బోండా ఉమమహేశ్వరరావు (ఫైల్‌)

సాక్షి, విజయవాడ : భూకబ్జా ఆరోపణల కేసులో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు భార్య సుజాతకు ఆర్డీవో నోటీసులు జారీ చేశారు.  ఆమెతో పాటు ఆయన అనుచరుడు మాగంటి బాబుకు కూడా నోటీసులిచ్చారు. బాధితుడు కేసిరెడ్డి సురేష్‌ బాబు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఆర్డీవో అధికారులు సోమవారం సబ్‌కలెక్టర్‌కు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీవో విచారణ చేపట్టనున్నారు. 

1951లో సూర్యనారాయణ అనే  స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్‌ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్‌ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది.

మరోవైపు తనపై నమోదు అయిన కేసులు కొట్టివేయాలంటూ బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు.

మరిన్ని వార్తలు