హెరిటేజ్‌ వ్యాన్‌లో ఎర్రచందనం దుంగలు

4 Jul, 2017 17:05 IST|Sakshi
హెరిటేజ్‌ వ్యాన్‌లో ఎర్రచందనం దుంగలు
తిరుపతి: ఎర్రచందనం స్మగ్లంగ్‌ కొంతపుంతలు తొక్కుతోంది. ఏకంగా హెరిటేజ్‌ వాహనంలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. తిరుపతి టాస్క్‌ఫోర్క్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. హెరిటేజ్‌ వాహనాలను ఎర్రచందనం రవాణాకు ఉపయోగిస్తున్నారని చాలా రోజుల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే అనుమానాలు నిజం చేస్తూ హెరిటేజ్‌ వాహనాన్ని స్మగ్లర్లు అక్రమ రవాణాకు ఉపయోగించారు.
 
వివరాలు.. తిరుపతి శివారులో గ్రాండ్‌ వరల్ఢ్‌ జీవకోన అటవీప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి నుంచి కూంబింగ్‌ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు తారసపడ్డారు. పోలీసులను గమనించిన స్మగ్లర్లు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దాదాపు వంద మంది ఎర్రచందనం స్మగ్లర్లు వాహనాలు వదిలి పరారయ్యారు. అయితే స్మగ్లర్లు వదిలి వెళ్లిన వాహనాలు హెరిటేజ్‌ సంస్థకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.
 
కాగా హెరిటేజ్‌ వాహనంలో దుంగల రవాణాపై పోలీసులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. పట్టుబడిన వాహనాలు రెండు నంబర్లతో రిజిస్టర్‌ అయినట్టు తెలుస్తోంది. ఒకటి ఏపీకి సంబందించిన రిజిస్ట్రేషన్‌ కాగ, మరొకటి తమిళనాడుది గా గుర్తించారు. తమిళనాడుకు చెందిన రిజిస్టర్‌ నంబర్‌ కనిపించకుండా స్మగ్లర్లు పెయింటింగ్‌ వేశారు. అయితే ఈ అంశంపై పోలీసులు పూర్తి సమాచారం సేకరించేందుకు విచారణ చేపట్టారు.