అడ్డగోలుగా దోచేశారు..

3 Nov, 2023 04:53 IST|Sakshi

ఇసుక దోపిడీపై 2019 ఏప్రిల్‌ 4న తేల్చి చెప్పిన ఎన్జీటీ

ఉచిత ఇసుక విధానంతో విజృంభించిన స్మగ్లర్లు

చంద్రబాబు అక్రమ నివాసానికి కూతవేటు దూరంలోనే తవ్వకాలు

ప్రకాశం బ్యారేజ్‌ జల విస్తరణ ప్రాంతంలో ఎనిమిది చోట్ల పొక్లెయిన్‌లతో తవ్వకాలు

రోజూ 2,500 ట్రక్కుల్లో 34 వేల టన్నుల ఇసుక తరలింపు

ఒక్కో ట్రక్కుకు రూ.5 వేల చొప్పున రూ.1.25 కోట్లు అక్రమ ఆర్జన

ఆ ఎనిమిది రీచ్‌ల ద్వారానే టీడీపీ పెద్దల జేబులోకి ఏటా రూ.450 కోట్లు

ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్లో!

తక్షణమే తవ్వకాలను ఆపేయాలని ప్రభుత్వానికి ఎన్జీటీ అల్టిమేటం 

పర్యావరణానికి విఘాతం కలిగించినందుకు రూ.వంద కోట్లు జరిమానా 

స్మగ్లర్ల నుంచే ఈ జరిమానా వసూలు చేయాలని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో నిబం­ధనలను ఉల్లంఘించి, జీవనదులను విధ్వంసం చేసి.. పర్యా­వ­రణాన్ని చావుదెబ్బ తీస్తూ అడ్డ­గోలుగా యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిందని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తేల్చి చెప్పింది. కృష్ణా నదీ గర్భంలో ప్రకా­శం బ్యారేజ్‌ జల విస్తరణ ప్రాంతంలో అప్పటి సీఎం చంద్రబాబు నివాసముంటున్న అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలో పొక్లెయినర్లతో భారీ ఎత్తున ఇసుకను తవ్వి.. వందలాది ట్రక్కులు, లారీలు, ట్రా­క్టర్లలో ఇసుకను స్మగ్ల­ర్లు తరలిస్తున్నా ప్రభుత్వం చూ­సీ చూడనట్లు వ్యవ­హరించిందని మండిపడింది.

ఈ మేరకు 2019 ఏ­ప్రిల్‌ 4న స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని 2016 మార్చి 4 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత ఇసుక స్మగ్లర్లు విజృంభించారు. అప్పటి నుంచి ఒక్క ప్రకాశం బ్యా­రే­జ్‌ జల విస్తరణ ప్రాంతంలో ఎనిమిది చోట్ల రోజూ 34 వేల టన్నుల ఇసుకను పొక్లెయిన్‌లతో తవ్వి 2,500 ట్రక్కుల్లో తరలించి.. ఒక్కో ట్రక్కు ఇసుకను కనీసం రూ.5 వే­ల చొప్పున విక్రయించి రూ.1.25 కోట్ల చొప్పున ఏ­డాదికి రూ.450 కోట్లను ఇసుక స్మగ్లర్ల ముఠా ఆర్జించిందని ఎన్జీటీ తేల్చింది.

శ్రవణ్‌­కుమార్‌ అనే న్యాయ­వాది వేరే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ త­వ్వ­కాల ద్వారా ఏడాదికి రూ.పది వేల కోట్లను స్మ­గ్లర్లు సంపాదిస్తున్నారని చెప్పడాన్ని ఎన్జీటీ ఎత్తిచూపింది. అక్రమంగా ఇసుకను తవ్వడం ద్వారా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిందని.. అందు­కు రూ.వంద కోట్ల జరిమానాగా చెల్లించాలని గత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ రూ.100 కోట్లను ఇసు­క స్మగ్లర్ల నుంచే వసూలు చేయాలంటూ 2019 ఏప్రిల్‌ 4న పేర్కొంది.

అప్పట్లో అధికారంలో ఉన్నది టీడీపీ సర్కారే. ప్రకాశం బ్యారేజ్‌ జల విస్తరణ ప్రాంతంలోనే 8 చోట్ల అక్రమంగా ఇసు­క­ను తవ్వి, తరలించి, విక్రయించి ఏడా­దికి రూ.450 కోట్లను ఇసు­క స్మగ్లర్లు దోచేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి, పె­న్నా, తుంగభద్ర, వంశధార, నాగావళి, చిత్రావతి సహా జీవనదులు, వాగులు, వంకల్లో ఇసు­కను అడ్డ­గోలు­గా దోచేయడం ద్వారా ఇంకెన్ని రూ.వేల కోట్ల దోచు­కొని ఉంటారో అంచనా వేసుకోవచ్చు.

ప్రకాశం బ్యా­రే­జ్‌ జల విస్తరణ ప్రాంతంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా పొక్లెయిన్‌లతో ఇసుకను తవ్వి,  తరలించడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలుగుతోందంటూ 2016లో ఎన్జీటీలో రైతులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని ఆదేశిస్తూ 2017 ఫిబ్రవరి 23న ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కానీ.. ఎన్జీటీ ఆదేశాలను తుంగలో తొక్కిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలకు దన్నుగా నిలిచింది.

ఇదే అంశాన్ని రైతులు మరోసారి ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో.. కృష్ణా నది గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలను నిగ్గు తేల్చాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లను 2018 డిసెంబర్‌ 21న ఎన్జీటీ ఆదేశించింది. సీపీసీబీ, పీసీబీలకు చెందిన ఏడుగురు అధికారులతో విచారణ కమిటీని నియమించింది.

బాబు జమానాలో లెక్కలేనన్ని ఇసుక అక్రమాలు
చంద్రబాబు జమానాలో తవ్వినకొద్దీ లెక్కలేనన్ని ఇసుక అక్రమాలు బయటపడ్డాయి. చంద్రబాబు, లోకేశ్‌ కనుసన్నల్లో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగించి, ఇసుకను తరలించింది. అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మె­ల్యేలు, ప్రజాప్రతినిధులైన దేవినేని ఉమామహేశ్వర­రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, నక్కా ఆనందబాబు, జవహర్, చింతమనేని ప్రభా­కర్, కూన రవికుమార్, పెందుర్తి వెంకటేష్, బూరు­గుపల్లి శేషారావు, ముళ్లపూడి బాపిరాజు, శ్రావణ్‌ కుమార్, తంగిరాల సౌమ్య, కొమ్మాలపాటి శ్రీధర్, శ్రీరాం తాతయ్య, ఆలపాటి రాజా తదితరులు ఇసుక అక్రమాల్లో చెలరేగిపోయారు.

ఈ ముఠా అంతా ఇసుక ద్వారా దోపిడి చేసిన మొత్తంలో నెలవారీ కమీషన్లు ఏకంగా రూ.500 కోట్లు లోకేశ్‌కు ముట్టజెప్పేవారనేది బహిరంగ రహస్యం. గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులతోపాటు తమ్మిలేరు తదితర నదులు, ఏరుల్లో సైతం అడ్డు అదుపులేకుండా పెద్ద ఎత్తున ఇసుక దందా సాగించారు. స్వయం సహాయక బృందాల పేరుతో టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దందా నడిపారు.

ఇసుక విధానంపై ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటూ దాదాపు 19 సార్లు జీఓలు ఇచ్చారు. వాస్తవానికి ఉచితంగా ఇసుక ఎవరికీ అందలేదు. అధిక ధర చెల్లించి కొనుక్కోవాల్సిన దుస్థితి కల్పించారు. పొరుగు రాష్ట్రాలకు సైతం పెద్ద ఎత్తున ఇసుకను లారీల్లో తరలించారు. అడ్డుకున్న వారిపై టీడీపీ నేతలు రెచ్చిపోయి దాడులు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధితులనే తప్పు పట్టడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.  

దోపిడీ గుట్టు రట్టు చేసిన కమిటీ 
ఎన్జీటీ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. చంద్ర­బాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూత­వేటు దూరంలో కృష్ణా నది గర్భంలో ఇసుకను తవ్వుతున్న ప్రాంతంతోసహా ఎగువన మరో ఏడు రీచ్‌లను 2019 జనవరి 17, 18న క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసింది. ఆ తనిఖీలో వెల్లడైన అంశాల ఆధారంగా 2019 జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. నివేదికలో ప్రధానాంశాలు.. 

► ప్రకాశం బ్యారేజ్‌ జల విస్తరణ ప్రాంతంలో కృష్ణా నది గర్భంలో అనుమతి లేకుండా.. నదీ ప­రి­­రక్షణ చట్టం, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది చోట్ల భారీ ప్రొక్లెయి­న్‌లు, మర పడవల ద్వారా రోజుకు సుమారు 34,650 టన్నుల ఇసుకను తవ్వుతున్నారు. ఇలా తవ్విన ఇసుకను రోజూ 2,500 ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ట్రక్కు ఇసుకను కనీసం రూ.5 వేల చొప్పున విక్రయి­స్తు­న్నారు.

అంటే రోజుకు ఇసుక అక్రమ అమ్మ­కా­లతో రూ.1.25 కోట్లు ఆర్జిస్తున్నారు. ఏడా­దికి ఈ 8 రీచ్‌ల నుంచే రూ.450 కోట్ల చొప్పున కొల్లగొట్టారు. ప్రకాశం బ్యారేజ్‌ జల విస్తరణ ప్రాంతంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం వల్ల జీవ­నది కృష్ణా విధ్వంసమైంది. కృష్ణా నది గర్భంలో 25 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. అందు­వల్ల ప్ర­వా­హ దిశ మారే అవకాశం ఉంది. వరద గట్లు, భవానీ ద్వీపం దెబ్బతిన్నాయి.

► ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించిన ఎన్జీటీ.. ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలిచిన అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రూ.వంద కోట్లను జరిమానాగా విధించింది. 

► ఇసుక దందా గురించి 2016 నుంచి హిందూ వంటి జాతీయ పత్రికలతోపాటు టీవీ ఛానెళ్లు వరుస కథనాలను ప్రసారం చేయడాన్ని ఎన్జీటీ తన తీర్పులో ప్రస్తావించింది. ఇసుక స్మగ్లర్లు తవ్వేసిన గుంతల్లో పడి.. ఇష్టారాజ్యంగా ట్రక్కులు నడపడం వల్ల వాటి కింది పడి 14 మంది చనిపోవడాన్ని ఎత్తిచూపింది. ఇసుక స్మగ్లర్లు అడ్డగోలుగా దోచేస్తున్నా.. దా­నికి అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడంలో ఔచిత్యం ఏమిటని చంద్రబాబు సర్కార్‌ను నిలదీసింది.  

మరిన్ని వార్తలు