నష్టాలపాలు

5 Jul, 2015 03:04 IST|Sakshi
నష్టాలపాలు

- గిట్టుబాటు కాని పాల ధర                  
- సిండికేట్‌గా ప్రయివేటు డెయిరీలు
- లీటర్‌పై రూ.10 వరకు తగ్గింపు    
- పట్టించుకోని ప్రభుత్వం
‘రోజూ 50 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేసి జిల్లాను రాష్టంలోనే అత్యధిక పాలఉత్పత్తి కేంద్రంగా మారుస్తా. అన్ని రకాల ప్రాత్సాహకాలు అందిస్తా.. పాడి రైతును ఆదుకుంటా’నంటూ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలివి.

 
(కానీ ఇప్పుడేం జరుగుతోందంటే..)
జిల్లాలో రోజుకు 20 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో గృహ, ఇతర అవసరాలకు పోను మార్కెట్‌కు 13 లక్షల లీటర్ల పాలు వస్తున్నాయి. వీటిని కొనేనాథుడే లేరు. ఒకటికి సగానికి అమ్ముకుని నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని పాడి రైతులు వాపోతున్నారు.
 
సాక్షి,చిత్తూరు: జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. బక్కచిక్కిన రైతు పాడిపై ఆధారపడి జీవన యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 20 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి.
 
దోచేయ్..

ప్రభుత్వం జిల్లా గ్రామీణాభివృద్ధి పథకం ఆధ్వర్యంలో బల్క్‌మిల్క్ సెంటర్ యూనిట్ల ద్వారా రోజుకు 3.38 లక్షల లీటర్లు కొనుగోలు చేస్తోంది. లీటరు పాలకు సరాసరి *26 ఇస్తోంది. మిగిలిన 11 లక్షల లీటర్ల పాలను హెరిటేజ్, విజయ, తిరుమల, దొడ్ల తదితర డెయిరీలతో పాటు దాదాపు 45 డెయిరీలు లీటరు పాలకు కేవలం *16 నుంచి రూ.19లోపు ధర చెల్లించి రైతును నిలువు దోపిడీ చేస్తున్నాయి.

సిండి‘కేట్లు’
50 రోజుల క్రితం వరకూ లీటరు పాలకు *26కు తగ్గకుండా చెల్లించిన ప్రయివేటు డెయిరీలు ప్రస్తుతం లీటరు పాలపై అమాం తంగా *10 తగ్గించి కొనుగోలు చేస్తున్నాయి. ప్రయివేటు డెయిరీలు మొత్తం సిండికేట్‌గా మారి తక్కువ ధరకు పాలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇక బీఎంసీయూలు నాణ్యత లేని పాలను సేకరిం చడంలేదు. పాడిరైతు నష్టాలపాలవుతున్నాడు.

మరిన్ని వార్తలు