వైఎస్సార్‌సీపీతోనే బీసీలు బలోపేతం

23 Mar, 2019 12:40 IST|Sakshi
రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌

67ఏళ్ల రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ చరిత్రలో తొలిసారి బీసీలకు అవకాశం ఇచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. యువకుడు, విద్యావంతుడు మార్గాని భరత్‌రామ్‌ బరిలో నిలిచారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు.  


ప్రశ్న : ఎంపీ టికెట్‌ దక్కడంపై కామెంట్‌?  
భరత్‌: అరుదైన అవకాశాన్ని  వైఎస్సార్‌సీపీ నాకు కల్పించింది. రాష్ట్రంలో 41 అసెంబ్లీ, ఏడు ఎంపీ స్థానాలు బీసీలకు ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ. ఇది వైఎస్‌ జగన్‌ ఘనత. బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేసింది. 


ప్రశ్న : ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఎలా ఉంది? 
భరత్‌ : చాలా అదృష్టంగా భావిస్తున్నా. యువతకు ప్రతినిధిగా ఉంటా. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తా. రాజమండ్రి ప్రాంతాన్ని టూరిజం, స్పోర్ట్స్, ఇండస్ట్రియల్‌ హబ్‌లుగా మారుస్తా.  ఒక మోడల్‌ నియోజకవర్గంగా తయారు చేస్తా.


ప్రశ్న : ప్రజా స్పందన ఎలా ఉంది? 
భరత్‌ : అద్భుతంగా ఉంది. ప్రజలు వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.  


ప్రశ్న : ఎంపీ అయితే మీ కార్యాచరణ?  
భరత్‌ : రాజమండ్రి పార్లమెంటరీ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించా. గోదావరి చెంతనే ఉన్నా.. అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. పరిష్కారానికి కృషి చేస్తా. రాజమండ్రిలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరిస్తా. గోదావరి పరిరక్షణకు చర్యలు తీసుకుంటా.  


ప్రశ్న : హేవలాక్‌ బ్రిడ్జి పర్యాటకాభివృద్దిపై ?  
భరత్‌ : హేవలాక్‌ బ్రిడ్జిని పాదచారుల వంతెనగా మార్పు చేస్తున్నట్లు ఎంపీ మురళీమోహన్‌  ప్రకటించారు. ఏమీ జరగలేదు. పర్యాటకంగా బ్రిడ్జిని అభివృద్ధి చేసేందుకు యత్నిస్తా.


ప్రశ్న : సినీ రంగంలోకి వెళ్లి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? 
భరత్‌ : ప్రజలందరికీ సేవ చేసే అకకాశం ప్రజాప్రతినిధిగా దక్కుతుందనే రాజకీయాల్లోకి వచ్చాను.


ప్రశ్న: విజయావకాశాలెలా ఉన్నాయి? 
భరత్‌: రాజమండ్రి ఎంపీ స్థానంతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం, ఆయన ప్రకటించిన నవరత్నాలే గెలిపిస్తాయి.  

మరిన్ని వార్తలు