కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సర్వే

6 Jan, 2014 01:03 IST|Sakshi

 నేడు ఏఐసీసీ పరిశీలకుల రాక
 సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తరఫున సర్వే నిమిత్తం ఏఐసీసీ పరిశీలకులు సోమవారం రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలకు ఒక్కొక్కరి చొప్పున 42 మంది పరిశీలకులను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎంపిక చేశా రు. సోమవారం ఆరుగురు నగరానికి రానున్నారు. కర్ణాటక ఎమ్మెల్యే గోవిందరాజన్‌కు రాజంపేట లోక్‌సభ పరిధిలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అప్పగించారు.
 
 ఉడిపి ఎమ్మెల్యే ప్రమోద్ మాధవరాజ్‌కు కర్నూలు; టుంకూర్ ఎమ్మెల్యే రఫీక్ అహ్మద్‌కు నల్లగొండ, మాజీ ఎంపీ అవారీకి విశాఖ, కర్ణాటక ప్రభుత్వ విప్ వెంకటేశ్‌కు తిరుపతి, మరో ఎమ్మెల్యే యశ్వంత్‌రావుగౌడకు అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో పరిశీలన బాధ్యత అప్పగించారు. వీరు తొలుత పీసీసీ చీఫ్ బొత్సతో సమావేశంకానున్నారు. తర్వాత నియోజకవర్గాలకు వెళ్లి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల అభిప్రాయాలను సేకరిస్తారు. పది రోజుల పాటు పర్యటించనున్న ఆయా నేతలు ర్యాండమ్ పద్ధతిలో ప్రజాభిప్రాయాన్నీ సేకరించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు రెండ్రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

>
మరిన్ని వార్తలు