పక్కదారి పట్టిన సంక్షేమం

11 Apr, 2019 10:38 IST|Sakshi

దారిమళ్లిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు

30 శాతం నిధులు కూడా ఖర్చుపెట్టని వైనం

దారుణమైన పాలన అంటున్న దళిత, గిరిజనులు 

‘చట్టం ఎంత గొప్పదైనా అమలు చేసేవాడు చెడ్డవాడయితే చెడ్డ ఫలితాలు వస్తాయి. చట్టం ఎంత చెడ్డదయినా అమలు చేసేవాడు మంచివాడయితే మంచి ఫలితాలు వస్తాయి’ అని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఎప్పుడో చెప్పారు. దీనిలో మొదటి వాక్యానికి సరిపోయేలా చంద్రబాబు ఐదేళ్లపాటు ఈ రాష్ట్రాన్ని పాలించాడని ప్రజలు అంటున్నారు. దళిత గిరిజన సంక్షేమంను కనీసం పట్టించుకోకపోవడం వల్ల వారి అభివృద్ధి నిలిచిపోయింది.

సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దళిత, గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఇతర పనులకు పాలకులు పక్కదారి పట్టించారన్న విమర్శలు ఆ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా శాఖలవారీగా నిధులు వినియోగం గురించి సమాచారం కూడా అందుబాటులో లేకుండా ప్రభుత్వం చేసిందని ఆరోపణలున్నాయి. ఎస్సీ, ఎస్టీ కాలనీల పర్యవేక్షణ కోసం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టాలని ఆదేశాలున్నా వాటిని ఖర్చు పెట్టకుండా ఖర్చు చేశామని లెక్కలు చెప్పిన దుస్థితి ఉందని విమర్శిస్తున్నారు.

సబ్‌ప్లాన్‌ ఉద్దేశ్యమిదీ...
అందరికీ సమాన అభివృద్ధి జరగాలనే ఉద్దేశ్యంతో 1974–75 సంవత్సరంలో పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఎస్టీల కోసం గిరిజన ఉప ప్రణాళికను ఏర్పాటు చేశారు. 1979–80లో ఆరో పంచవర్ష ప్రణాళికలో ఎస్సీల కోసం స్పెషల్‌ కంపోనెంట్‌ ప్లాన్‌ ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన 16.2 శాతం ఉన్న ఎస్సీలు, 8.2 శాతం ఉన్న ఎస్టీలు  మొత్తంగా కలసి బడ్జెట్‌లో కూడా 24.4 శాతం బడ్జెట్‌ కేటాయించాలని నిర్ణయించారు. నిధులు దారి మళ్లకుండా 2013 జనవరి 24వ తేదీన షెడ్యూల్డ్‌ కాస్టు సబ్‌ప్లాన్‌ అండ్‌ ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ ప్లానింగ్‌ ఆలోకేషన్, అండ్‌ యుటిలైజేషన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ రిసోర్సెస్‌ యాక్టును ప్రవేశపెట్టారు. ఈ నిధులు పక్కదారి పట్టకుండా ఖర్చు చేయాలని, నిధులు ఖర్చు కాకపోతే తరువాత ఆర్థిక సంవత్సరానికి వాడుకునే సౌలభ్యాన్ని తీసుకువచ్చారు. శాసన సభ సాక్షిగా చేసిన ఈ చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది.

నిధులన్నీ పక్కదారే...
ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం దళిత గిరిజనులను చిన్నచూపు చూసింది. సబ్‌ప్లాన్‌ నిధులను సంబంధం లేని పథకాలకు  కేటాయించారు. రాజధాని నిర్మాణం కోసం, స్టేడియంల నిర్మాణాలు అంటూ ఆయా శాఖలకు మళ్లించారు. ఇక ప్రకృతి విపత్తులకు కూడా ఈ నిధులను కేటాయించారు. ఈ నిధులతో ప్యాసింజరు ఆటోలు ఇవ్వాల్సి ఉన్నా చెత్త తొలగించే ఆటోలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. భూములకు సంబంధించిన కొనుగోలు–పంపిణీ జరగలేదు. ప్రభుత్వం చేశామని చెప్తున్నా వాటికి సంబం«ధించిన వివరాల సమాచారం మాత్రం లేని పరిస్థితి. ఇక కృష్ణా, గోదావరి పుష్కరాలకు కూడా ఇవే నిధులు వాడారని, ప్రస్తుతం పసుపు–కుంకుమ పథకానికి కూడా ఈ నిధులనే ఉపయోగిస్తున్న పరిస్థితులు ఈ ప్రభుత్వంలో నెలకొన్నాయి.

ప్రభుత్వంపై మండి పడుతున్న దళిత, గిరిజనులు
తమకు కేటాయించిన నిధులను తమకు ఖర్చు చేయకుండా.. పక్కదారి పట్టించడం పట్ల దళిత గిరిజనులు మండిపడుతున్నారు. కనీసం 30 శాతం నిధులు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి ఈ ఐదేళ్ల కాలంలో జరిగిందన్నారు. దళిత గిరిజన సంక్షేమం అంటే చంద్రబాబుకి చిన్నచూపు అని అందుకే తమ నిధులు తమకు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శిస్తున్నారు. దళిత గిరిజన సంక్షేమం అనేది లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో దళిత గిరిజనులు దగ్గాపడ్డారని వాపోతున్నారు.

ఎస్టీలకు సంబంధించి జనాభా 27,40,133 ఉన్నారు.

కేటాయింపులు ఇలా...

సంవత్సరం   నిధుల కేటాయింపులు
2014–15    1500.26 కోట్లు
2015–16   1904.48కోట్లు
2016–17  3099.96 కోట్లు
2017–18  3528.75 కోట్లు
2018–19  4176.60 కోట్లు
మొత్తం  14,210.05 కోట్లు

ఎస్సీలకు సంబంధించిన వివరాలు ఇవీ...
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 13 జిల్లాలు, 676 మండలాలున్నాయి. ఇందులో  84,45,399 మంది ఎస్సీలు ఉన్నారు. వీరికి సంబంధించి నిధులు కేటాయింపు ఇలా జరిగింది.

సంవత్సరం నిధుల కేటాయింపులు
2014–15   4574.47 కోట్లు
2015–16  5880.62 కోట్లు
2016–17  8724.25 కోట్లు
2017–18  9847.13 కోట్లు
2018–19   11,228.10 కోట్లు
మొత్తం  40,254.57 కోట్లు

 
నిధుల పక్కదారి ఇలా

 సంవత్సరం   ఎస్సీ, ఎస్టీ ప్లాన్‌   నిధులు  ఖర్చుపెట్టిన నిధులు  శాతం  పక్కదారి
2014–15  రూ. 6074 కోట్లు  రూ. 1518 కోట్లు సుమారు 25 శాతం రూ. 4556 కోట్లు
2015 – 16   రూ. 7784 కోట్లు   రూ. 1556 కోట్లు 20 శాతం రూ. 6228 కోట్లు
2016–17 రూ.11823 కోట్లు రూ. 2354 కోట్లు 20 శాతం రూ. 9429 కోట్లు
2017–18  రూ. 13375 కోట్లు రూ. 3343 కోట్లు  25 శాతం రూ. 10032 కోట్లు
2017–19  రూ. 15404 కోట్లు  రూ. 3080 కోట్లు 20 శాతం రూ. 12324 కోట్లు

 
దళిత సంక్షేమంపై చిన్నచూపు  
ఈ ప్రభుత్వం దళిత సంక్షేమంపై చిన్న చూపు చూసింది. నిధులను పక్కదారి పట్టించింది. కనీసం 25 నుంచి 30 శాతం నిధులను మాత్రమే వినియోగించడం భాదాకరం. ఈ ప్రభుత్వం పైచర్యలు తీసుకోవాలి.
- రామస్వామి, రీసెర్చ్‌ స్కాలర్‌

చట్టబద్ధత చేసినా పక్కదారి  
నిధుల వినియోగంపై చట్టబద్ధత కల్పించినా ప్రభుత్వాలు నిధులు పక్కదారి పట్టించడం దారుణం. ఈ ప్రభుత్వ హయాంలో గిరిజన దళిత సంక్షేమం మరుగున పడింది.
- శ్రీమన్నారాయణ, న్యాయశాఖ స్కాలర్‌

మరిన్ని వార్తలు