అవినీతి మూలాలపై ఏసీబీ ఆరా

28 Apr, 2016 00:59 IST|Sakshi

 శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్: జిల్లాలో ఉపకార వేతనాల కుంభకోణంలో మూలాలను తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు లోతైన విచారణ ఆరంభించారు. జిల్లాకు చేరుకున్న మాజీ బీసీ సంక్షేమ శాఖాధికారి బి.రవిచంద్రను ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ రంగరాజు బుధవారం విచారించారు. విద్యార్థులకు మంజూరుచేసిన ఉపకారవేతనాలను వారి ఖాతాలకు ఎలా మళ్లిస్తారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ప్రైవేటు ఖాతాలకు ఎలా వెళ్లాయని ప్రశ్నించారు.
 
 అలాగే, గిరిజన సంక్షేమ శాఖ నుంచి గిరిజన పోస్టు మెట్రిక్ వసతిగృహాల్లో బీసీ విద్యార్థుల జాబితాలు లేకుండా బీసీ సంక్షేమశాఖ పరిధిలో బిల్లులు ఎలా చెల్లించారని, శాఖాపరంగా ఉన్న లోపాలను సరిదిద్దడంలో ఎదురైన సమస్యలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టురుగా ఉన్న ఎంవీ వీ నాయక్‌ను ప్రశ్నించి తెలుసుకున్నారు. గిరిజన వసతిగృహాల్లో ఉన్న 3శాతం విద్యార్థుల వివరాలను బీసీ సంక్షేమ శాఖకు పంపించక పోవడానికి గల కారణాల ను అడిగితెలుసుకున్నారు. తనిఖీలు చేయకపోవడం పై ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలు గిరిజనసంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు తెలియకుండానే వార్డెన్లు ఎలా తీసుకున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది. బీసీ సంక్షేమ శాఖ, ప్రైవేటు కాలేజీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని భావిస్తున్న ఏసీబీ అధికారులు ఇప్పటికే కొందరి ఖాతాలను పరిశీలించారు.
 
 రికార్డుల పరిశీలనకు నిర్ణయం
 బీసీ సంక్షేమ శాఖ పరిధిలో పని చేస్తున్న పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో 2009 నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీ లు, రికార్డులను పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా పోస్టుమె ట్రిక్ కాలేజీ వసతిగృహాల రికార్డులను మూడు రోజుల్లోగా అందజేయాలని వార్డెన్లకు ఆదేశిం చారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 2009 నుం చి మంజూరైన డైట్ బిల్లులతో పాటు ఉపకారవేతనాల మంజూరును పరిశీలించనున్నారు.
 
 బ్యాంకు ఖాతాలపై ఆంక్షలు
 ఉపకార వేతనాల మంజూరులో అక్రమాలపై జరుగుతున్న విచారణ నేపథ్యంలో గిరిజన సంక్షేమ వసతిగృహ అధికారుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని ఐటీడీఏ పీవో జె.వెంకటరావు తెలిపారు. వార్డెన్ల ఖాతాల్లో మూడేళ్లుగా జరిగిన లావాదేవీల వివరాలను సంబంధిత బ్యాంకుల సమన్వయంతో మధింపు చేస్తున్నామన్నారు. అనుమానిత పోస్టుమెట్రిక్ వసతి గృహాల ఆన్‌లైన్ ఈ-పాస్ ఉపకా ర వేతనాల స్టేట్‌మెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించా రు. ప్రాథమిక నిర్ధారణ అనంతరం శ్రీకాకుళం పోస్టు మెట్రిక్ వసతి గృహ సంక్షేమాధికారి ఎస్.ఝాన్సీరాణి, సహాయ గిరిజన సంక్షేమాధికారి బి.ఎర్నన్నాయుడుపై శ్రీకాకుళం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసుల నమోదయ్యాయన్నారు. ఝాన్సీ రాణిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు