విభజన ఆగదని తెలిసీ భేటీలెందుకు?

1 Feb, 2014 14:21 IST|Sakshi

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యేందుకు సీమాంధ్ర మంత్రుల్లో విముఖత వ్యక్తం అవుతోంది. శనివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కిరణ్ సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే  ఏ అజెండాతో ఈ సమావేశం పెట్టారో అర్థం కావడంలేదని మంత్రులు వాపోతున్నారు. ముఖ్యమంత్రికి భవిష్యత్తు కార్యాచరణపై ఏమాత్రం స్పష్టత ఉండడం లేదని మంత్రులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

సీఎం సొంత అజెండాతో పనిచేస్తే తామేలా సహకరిస్తామని మంత్రులు  ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విభజన ప్రక్రియలో కిరణ్‌ భాగస్వామి అయిన తర్వాత ఇప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నా ఏం ప్రయోజనం ఉండదని మంత్రులు చెబుతున్నారు.  విభజన ఆగదని తెలిసీ ఈ సమావేశం నిర్వహించడంవల్ల ప్రయోజనమేమిటని మంత్రులు పేర్కొంటుండం విశేషం.  ఇలాంటి చర్యలతో  పార్టీ హైకమాండ్‌ను ధిక్కరిస్తున్నామనే అభిప్రాయం వస్తుందని భావిస్తున్న మంత్రులు సీఎం సమావేశానికి పెద్దసంఖ్యలో  డుమ్మా కొడుతున్నారు. కాగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, బాలరాజు, గంటా శ్రీనివాసరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, వట్టి వసంత్ కుమార్, శత్రుచర్ల విజయ రామరాజు, పార్థసారధి, సి.రామచంద్రయ తదితరులు హాజరయ్యారు.

మరోవైపు కేంద్రం తెలంగాణ బిల్లుపై కసరత్తును వేగవంతం చేసింది. టి బిల్లును తిరస్కరించాలని రాష్ట్రం తీర్మానించినా పట్టించుకోకుండా పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు ముందుకెళ్తోంది. ఈ ప్రక్రియపై చర్చించేందుకు ఏర్పాటైన జీవోఎం సోమవారం సాయంత్రం మీడియాతో సమావేశం ఏర్పాటు చేసింది. విభజన బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో చిదంబరం నేతృత్వంలో కమల్‌నాథ్‌, మనీష్‌తివారీ సహా జీవోఎం సభ్యులంతా హాజరయ్యే ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు