రాష్ట్రానికే ఆదర్శంగా సిద్దిపేటలో మినీస్టేడియం

12 Feb, 2014 23:53 IST|Sakshi

 సిద్దిపేటజోన్, న్యూస్‌లైన్:  సిద్దిపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న స్విమ్మింగ్‌పూల్, మినీ స్టేడియాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దనున్నట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేటలో మినీస్టేడియం అభివృద్ధికి ప్రభుత్వం రూ.8కోట్లను మంజూరు చేసిందన్నారు. జీఓ నం. 124 ప్రకారం సిద్దిపేటలో మినీస్టేడియం, రూ.5కోట్లతో అధునాతన స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు.

 ఈ నిధులతో ఫిల్టర్ రూములు, మెకానికల్ సెక్షన్, డ్రెస్సింగ్ రూములు, ప్రహరీ, సీసీ రోడ్లను చేపట్టనున్నట్లు వెల్లడించారు. రూ.కోటితో చేపట్టనున్న మినీ స్టేడియంలో పెవీలియన్, ఫెన్సింగ్ పనులు, వాలీబాల్ కోర్టును నిర్మిస్తామన్నారు. అదే విధంగా రూ.2.10కోట్లతో ఇండోర్ స్టేడియం, షటిల్, ఫుట్‌బాల్, టెన్నిస్ కోర్టులను నిర్మిస్తామన్నారు. సిద్దిపేట పట్టణంలోని మురికివాడల అభివృద్ధికి రాజీవ్ అవాస్ యోజన పథకం కింద ప్రతిపాదనలు అందజేశామన్నారు. విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకోసం ప్రతిపాదించిన రూ.110కోట్లు త్వరలో మంజూరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ యువజన విభాగం పట్టణాధ్యక్షులు మర్పల్లి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు