సొంతింటి కల.. సాకారమెలా

28 Aug, 2014 03:11 IST|Sakshi

 ఏలూరు సెంట్రల్ :ఇళ్లు లేని వారందరికీ రూ.లక్షన్నరతో గృహ నిర్మాణం చేస్తాం.. ఐదేళ్లలో పూరిగుడిసెలు లేని రాష్ట్రం నిర్మిస్తాం.. మధ్యతరగతి వర్గాల కోసం ప్రత్యేక గృహ నిర్మాణ పథకం అమలు చేస్తా మంటూ ఎన్నికల వేళ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలివి. ఇవేకాకుండా శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్మిస్తామని కూడా ఆనాడు చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు మాత్రం ‘రాజధాని నిర్మాణానికే స్థలం దొరక్క చస్తుంటే ఇళ్ల నిర్మాణం గొడవేంటి.. తర్వాత చూద్దాంలే’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ‘ఎంతలో ఎంత మార్పు. ఇది నయవంచన. చంద్రబాబు మార్కు పాలన. ఇప్పటికే తుంగలో తొక్కేసిన అనేక ఎన్నికల వాగ్దానాల్లో ఇది కూడా చేరిపోయింది. ఫలితంగా పేదవాడి సొంతింటి కల పునాది పడకముందే శిథిలమైపోయిందం’టూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
 
 ఓట్లేసి గెలిపించినా...
 అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ ఊరూరా ఊదరగొట్టారు చంద్రబాబునాయుడు. స్వతహాగా మంచివారయిన పశ్చిమ ప్రజలు ఆయన మాటల్ని నమ్మారు. ఓట్లేసి గెలిపించారు. చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దానికి గృహ నిర్మాణం మినహాయింపు కాదు. బడ్జెట్‌లో అత్తెసరు కేటాయింపుల కారణంగా ఈ ఏడాది కొత్త ఇళ్ల నిర్మాణం హుళక్కేనని స్వయంగా అధికారులే చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు మొదలై పలు దశల్లో నిలిచిపోయిన ఇళ్ల పరిస్థితి ఏమిటన్నది అధికారులకూ అర్థంకాని శేష ప్రశ్నగానే ఉంది.
 
 కేటారుుంపులు రూ.808 కోట్లు.. బకాయిలు రూ.450 కోట్లు
 రాష్ట్ర తొలి బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు రూ.808 కోట్లు కేటాయించారు. గతంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రూ.450 కోట్ల మేర బకాయిలు చెల్లిం చాల్సి ఉంది. ఈ బకాయి పోను ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో మిగిలేది రూ.358 కోట్లు మాత్రమే. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకే ఈ మొత్తం ఓ మూలకు రాదని ఆ శాఖ సిబ్బందే సెలవిస్తున్నారు. అలాంటి దశలో ఇక కొత్త ఇళ్ల మంజూరు తమవల్ల కాదని అధికారులు చేతులెత్తేస్తున్నారు.
 
 90 వేల ఇళ్లల్లో పూర్తయియంది కొన్నే
 2013-14 సంవత్సరంలో జిల్లాకు 90వేల ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో కొన్ని మాత్రమే పూర్తికాగా, చాలావరకు పలు దశల్లో నిలిచిపోయూయి. అధికారులు బిల్లులు చెల్లించని కారణంగాన వాటి పనులు ముందుకు సాగటం లేదు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం, రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల నిధుల మంజూరులో జాప్యం జరిగిందని మొన్నటివరకూ అధికారులు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బడ్జెట్ కేటాయింపుల్ని బట్టి చూద్దామంటూ సర్దుకొచ్చారు. ఇలా కాలయాపన కారణంగా ప్రస్తుతం పనులు నిలిచిపోయిన ఇళ్లు కూడా పాడుబడి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు.
 
 దీనిపై జిల్లా గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డెరైక్టర్‌ను వివరణ కోరగా, జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు రూ.38 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు బదులిచ్చారు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం పాత బకాయిలు రూ.38 కోట్లు ఉండగా, పలు దశ ల్లో ఆగిపోరుున నిర్మాణాలు పూర్తి కావాలంటే.. పెద్ద ఎత్తున నిధులు అవసరం. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం విదిల్చే కొద్దిపాటి మొత్తాన్ని సర్దుబాటు చేసినా పాత ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త ఇళ్ల ఊసెత్తే అవకాశం లేదు. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అనుమతుల కోసం ఎదురుచూస్తున్న జిల్లాలోని 69,801మంది లబ్ధిదారులకు సొంతింటి కల ఇప్పట్లో నెరవేరే సూచన కనిపించడం లేదు.

 

మరిన్ని వార్తలు